Delhi CM : చట్టసభల్లో ఏమాత్రం అనుభవం లేకపోయినా, ఎమ్మెల్యేగా ఎన్నికైన మొదటి దఫాలోనే అత్యున్నతమైన సీఎం పదవి దక్కడం ఎలా ఉందనే ప్రశ్నను శుక్రవారం ఢిల్లీ సీఎం (Delhi CM) రేఖా గుప్తా (Rekha Gupta) ఎదుర్కొన్నారు. ఓ జాతీయ మీడియా సంస్థ ప్రతినిధి ఆమెకు ఈ ప్రశ్న వేశారు. అందుకు ఆమె తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చారు. అత్యున్నత స్థాయి పదవి దక్కినప్పుడు తాను బాలీవుడ్ సినిమా ‘నాయక్’ లోని హీరోయిన్లా ఫీలయ్యానని ఆమె చెప్పారు.
ఈ సందర్భంగా రేఖా గుప్తా ఉర్దూ కవయిత్రి రహత్ ఇందోరి రాసిన ‘కవిత’ ను ప్రస్తావించారు. ఆ కవిత నుంచి ‘నేను కొమ్మల నుంచి రాలిపోయే ఆకుల్లో ఒక ఆకును కాను. ఎవరైనా ఆ తుఫానుకు చెప్పండి తనను తన అదుపులో ఉండమని’ అనే వ్యాఖ్యాన్ని గుర్తుచేశారు. అదేవిధంగా ఢిల్లీకి సీఎం కావాలనేది తన కల కాదని, తన పని తాను చేసుకుంటూ పోయానని చెప్పారు. ఈ పదవి తనకు లాటరీలా వచ్చింది కాదని, మహిళలపై గౌరవంతో తనకు ఈ పదవి కట్టబెట్టారని రేఖా గుప్తా అన్నారు. అందుకు ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రేఖా గుప్తా తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. శాలిమార్ బాగ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకుగాను 48 స్థానాల్లో గెలిచిన బీజేపీ అధికారంలోకి వచ్చింది. దాంతో బీజేపీ హైకమాండ్ చట్టసభల్లో ఏమాత్రం అనుభవం లేని రేఖా గుప్తాను ముఖ్యమంత్రిగా నియమించింది.