న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రివాల్ ఇవాళ సాయంత్రం ఆప్ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లతో భేటీ కానున్నారు. ఢిల్లీలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో కేజ్రివాల్ తన పార్టీ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లతో భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. అవినీతి ఆరోపణలతో అరెస్టయిన ఢిల్లీ ప్రభుత్వ సీనియర్ మంత్రులు మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్ తమ పదవులకు రాజీనామాలు చేయడంతో.. అక్కడ క్యాబినెట్ విస్తరణ తప్పనిసరైంది.
ఈ నేపథ్యంలో క్యాబినెట్ విస్తరణ గురించి ఆప్ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లతో కేజ్రివాల్ చర్చించనున్నట్లు సమాచారం. ఇదిలావుంటే మంత్రులు కైలాష్ గెహ్లాట్, రాజ్కుమార్ ఆనంద్లకు కొత్త శాఖలు కేటాయించేందుకు అనుమతించాలంటూ సీఎం కేజ్రివాల్ పంపిన ప్రతిపాదనకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమోదం తెలిపారు. కేజ్రివాల్ ప్రతిపాదన ప్రకారం.. కైలాష్ గెహ్లాట్కు 8, రాజ్కుమార్ ఆనంద్కు 10 శాఖలను అదనంగా కేటాయించనున్నారు.
హోం, హెల్త్, ఎడ్యుకేషన్ లాంటి కీలక శాఖలను కూడా సీఎం కేజ్రివాల్ ఆ ఇద్దరు మంత్రులపై నమ్మకంతో వారికే కట్టబెట్టాడు. ఢిల్లీ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లో.. గెహ్లాట్కు ఆర్థిక, ప్రణాళిక, ప్రజా పనులు, విద్యుత్, హోం, పట్టణాభివృద్ధి, నీటి పారుదల, వరదల నియంత్రణ, తాగునీటి శాఖలను కేటాయిస్తున్నట్లు
పేర్కొన్నారు.
అదేవిధంగా రాజ్కుమార్ ఆనంద్కు.. విద్య, లాండ్ అండ్ బిల్డింగ్, విజిలెన్స్, సర్వీసెస్, టూరిజం, కళలు, సంస్కృతి, భాషలు, కార్మిక, ఉపాధి కల్పన, ఆరోగ్య, పరిశ్రమల శాఖలను కట్టబెట్టినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కాగా, సత్యేందర్ జైన్ ఇప్పటికే మనీలాండరింగ్ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్నారు. తాజాగా మనీశ్ సిసోడియా లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్టయ్యారు. కాగా, కేంద్ర ప్రభుత్వ ఒత్తిడితోనే సీబీఐ జైన్, సిసోడియాలపై తప్పుడు కేసులు బనాయించిందని ఆప్ విమర్శిస్తున్నది.