న్యూఢిల్లీ: తమ ఎమ్మెల్యేల వేతనాల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనకు ఢిల్లీ క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం నెలకు రూ.12 వేలుగా ఉన్న ఢిల్లీ ఎమ్మెల్యేల (Delhi MLAs) వేతనాన్ని రూ.30 వేలకు పెంచాలన్న ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ అధ్యక్షతన మంగళవారం ఉదయం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. క్యాబినెట్ తాజా నిర్ణయంతో ఇక నుంచి ఢిల్లీ ఎమ్మెల్యేలు నెలకు రూ.30 వేల వేతనం అందుకోనున్నారు.
ఇప్పటివరకు ఢిల్లీ ఎమ్మెల్యేలకు రూ.12 వేల నెల జీతం, ఇతర అలవెన్సులు కలిపి రూ.54 వేలు వచ్చేవి. ఇప్పుడు నెల జీతం రూ.30 వేలకు పెరుగడంతో.. అలవెన్సులు మరో 60 వేల వరకు రానున్నాయి. అంటే జీతం, అలవెన్స్లు కలిపి ఒక్కో ఎమ్మెల్యేకు నెలకు రూ.90 వేలు అందనున్నాయి. కాగా, 2015లోనే ఢిల్లీ ప్రభుత్వం ఎమ్మెల్యేల వేతనాలను 2.10 లక్షలకు పెంచుకోవాలని భావించింది. అందుకోసం అసెంబ్లీలో బిల్లును కూడా ఆమోదించుకుంది.
అయితే, కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ ఎమ్మెల్యేల వేతనాల పెంపునకు ఆమోదం తెలుపకపోవడంతో ఆ బిల్లు చెల్లుబాటు కాకుండా పోయింది. తాజాగా కేంద్రం ఢిల్లీ ఎమ్మెల్యేలు తమ వేతనాలను రూ.30 వేల వరకు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వడంతో.. ఆ ప్రతిపాదనకు ఇవాళ ఢిల్లీ క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.