న్యూఢిల్లీ : కేంద్ర రక్షణ, హోంశాఖ, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ సెక్రెటరీలతో పాటు ఇంటిలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ పదవీకాలాన్ని కేంద్రం రెండేళ్లు పెంచుతూ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంతకు ముందు సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీ కాలాన్ని పొడగించిన విషయం తెలిసిందే. కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అవసరమని భావించిన సందర్భంలో రక్షణ శాఖ, హోంశాఖ, రా సెక్రెటరీ, సీబీఐ, ఈడీ డైరెక్టర్లకు కేంద్ర ప్రభుత్వం సర్వీసు పొడగింపు ఇవ్వొచ్చు.
అయితే, సర్వీసు పొడగింపునకు గల కారణాలు లిఖితపూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుంది. 2005 కేంద్ర ప్రభుత్వం కార్యదర్శులు, డైరెక్టర్లకు రెండేళ్ల పదవీకాలం పెంపును ఖరారు చేసింది. అయితే, కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చీఫ్ల పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాలకు పెంచింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన రెండు ఆర్డినెన్స్లపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆదివారం సంతకాలు చేశారు.