న్యూఢిల్లీ: యూరోప్కు చెందిన క్షిపణి తయారీ సంస్థ ఎంబీడీఏపై భారత రక్షణ శాఖ మిలియన్ యూరోల జరిమానా విధించింది. రాఫేల్ యుద్ధ విమాన కొనుగోలు ఒప్పందం ప్రకారం.. ఎంబీడీఏ కంపెనీ ఆలస్యం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రాఫేల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్కు చెందిన డాసాల్ట్ ఏవియేషన్ కంపెనీ తయారు చేస్తోంది. అయితే ఆ సంస్థకు క్షిపణి వ్యవస్థను ఎంబీడీఏ సరఫరా చేస్తున్నది. 36 రాఫేల్ విమానాల కొనుగోలు కోసం 2016 సెప్టెంబర్లో ఫ్రాన్స్తో ఇండియా ఒప్పందం కుదుర్చుకున్నది. 59వేల కోట్లకు ఆ డీల్ జరిగింది. అయితే క్షిపణి వ్యవస్థను అందించే కాంట్రాక్టు కూడా దీనిలోకే వస్తుంది. 2019 సెప్టెంబర్ నుంచి 2020 సెప్టెంబర్ మధ్య అంగీకారం ప్రకారం ఎంబీడీఏ కంపెనీ బాధ్యతలను నిర్వర్తించలేదు. దీంతో ఆ కంపెనీపై రక్షణశాఖ మిలియన్ యూరోల జరిమానా విధించింది.