శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఇటీవల ఆర్మీ జవాన్ల దాడిలో మరణించిన బాధిత కుటుంబాలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) బుధవారం కలిశారు. ఈ దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గ్రామస్తులను ఆయన పరామర్శించారు. ఈ సంఘటనపై దర్యాప్తు తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే కూడా రాజ్నాథ్ సింగ్ వెంట ఉన్నారు. దీనికి ముందు జమ్ముకశ్మీర్లో భద్రతను ఆయన సమీక్షించారు. పౌరుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని ఆర్మీకి సూచించారు.
కాగా, ఈ నెల 20న పూంచ్లో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు అనూహ్యంగా దాడి చేశారు. ఈ సంఘటనలో నలుగురు జవాన్లు మరణించగా మరికొందరు గాయపడ్డారు. అయితే ఉగ్రవాదుల దాడి గురించి ప్రశ్నించేందుకు గ్రామానికి చెందిన 15 మంది వ్యక్తులను ఆర్మీ జవాన్లు అదుపులోకి తీసుకున్నారు. వారిని కొట్టి హింసించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ముగ్గురు పౌరులు మరణించగా పది మందికిపైగా గాయపడ్డారు. ఆర్మీ ఉన్నతాధికారులు ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించారు. బ్రిగేడియర్ స్థాయి అధికారిని విధుల నుంచి తప్పించడంతోపాటు ఆయనను ప్రశ్నిస్తున్నారు.