న్యూఢిల్లీ: రైతుల డిమాండ్ల పరిష్కారానికి కేంద్రప్రభుత్వం బుధవారం చేసిన ప్రతిపాదనపై ఏకాభిప్రాయం కుదిరిందని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) వెల్లడించింది. అయితే, ఆ ప్రతిపాదనను ప్రభుత్వ లెటర్హెడ్పై అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేసింది. ఉద్యమాన్ని కొనసాగించాలా.. నిలిపివేయాలా.. అన్నదానిపై గురువారం మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకొంటామని తెలిపింది. మంగళవారం కేంద్ర హోంశాఖ రైతుల కమిటీకి చేసిన ప్రతిపాదనపై ఎస్కేఎం బుధవారం సమావేశమైంది. ఆ ప్రతిపాదనను నిరాకరించింది. దీంతో కేంద్రం దాన్ని సవరించి కొత్త ప్రతిపాదన చేసింది. సమావేశం అనంతరం ఎస్కేఎం కోర్ కమిటీ సభ్యుడు, రైతు నేత గుర్నామ్ సింగ్ చూడానీ విలేకరులతో మాట్లాడారు. ‘గురువారం మధ్యాహ్నం సింఘు సరిహద్దులో 12 గంటలకు ఎస్కేఎం మళ్లీ సమావేశం అవుతుంది’ అని చెప్పా రు. కేంద్రం ప్రతిపాదన వివరాలను వెల్లడించలేదు. ఉద్యమంలో చనిపోయిన రైతుల కుటుంబాలకు పరిహారం, మద్దతుధరల చట్టం తదితర డిమాండ్లపై కేంద్రంతోచర్చలకు ఎస్కేఎం ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించిన సంగతి తెలిసిందే.
రైతుల మరణాలను రికార్డు చేయాల్సింది రాష్ర్టాలేనని కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ పార్లమెంటుకు తెలిపారు. రైతు మరణాలకు పరిహారం చెల్లించాల్సింది కూడా రాష్ర్టాలే అన్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో చనిపోయిన రైతుల వివరాలపై ప్రశ్నకు ఆయన ఈ మేరకు రాజ్యసభలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఉద్యమంలో రైతులు చనిపోతే.. ఆయా రాష్ర్టాలే రికార్డు చేసి సమాచారం ఇవ్వాలన్నారు.