Himachal Pradesh : తమ రాష్ట్రంలో లాటరీలు ప్రవేశపెట్టేందుకు హిమాచల్ ప్రభుత్వం సిద్ధమైంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న హిమాచల్ ప్రదేశ్.. లాటరీల ద్వారానైనా ఎంతోకొంత ఆదాయం సంపాదించుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశంలో లాటరీలకు అనేక రాష్ట్రాలు వ్యతిరేకం. 28 రాష్ట్రాల్లో 13 రాష్ట్రాలు మాత్రమే లాటరీలకు అనుమతిస్తున్నాయి.
అందులోనూ వాటిపై ప్రభుత్వ పర్యవేక్షణ, ఆజమాయిషీ ఉంటుంది. లాటరీల వ్యసనంలో పడి ప్రజలు తమ సొమ్మును టిక్కెట్ల కోసం ఖర్చు పెట్టి ఇంకా ఇబ్బందుల పాలవుతారనే ఉద్దేశంతో ప్రభుత్వాలు లాటరీలను అనుమతించడం లేదు. అయితే, ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం మాత్రం లాటరీలు అనుమతించాలని నిర్ణయించింది. అది కూడా రాష్ట్రంలో 27 సంవత్సరాల తర్వాత లాటరీలకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి కారణం ఉంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. దాదాపు రూ.లక్ష కోట్ల లోటులో ఉంది.
అందుకే ఆదాయం పెంచుకునే మార్గాలపై దృష్టిపెట్టింది. దీనిలో భాగంగా లాటరీలను ప్రవేశపెడుతోంది. వీటి ద్వారా ఏడాదికి కనీసం రూ.50 కోట్ల ఆదాయమైనా వస్తుందని భావిస్తోంది. లాటరీల ప్రక్రియ నిర్వహించేందుకు అర్హత కలిగిన సంస్థల నుంచి ఈ టెండర్లను ఆహ్వానించింది. టెండర్ దక్కించుకున్న సంస్థలు ఆన్లైన్తోపాటు, పేపర్ టిక్కెట్ల అమ్మకాలకు బాధ్యత వహించాలి. ఈ సంస్థలే అధికారిక ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవాలి. అధీకృత ఆఫ్లైన్ స్టోర్స్తోపాటు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ టిక్కెట్లు అమ్ముతాయి. సెప్టెంబర్లో టెండర్ల ప్రక్రియ మొదలవుతుంది. మరో రెండు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి, త్వరలోనే లాటరీలు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.
కుదిరితే దీపావళి నుంచి లాటరీ టిక్కెట్ల అమ్మకాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. టిక్కెట్లు అమ్ముడైన తర్వాత ప్రతి రోజు గరిష్టంగా 12 డ్రాలు తీయాలని భావిస్తోంది. అలాగే, ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, గాంధీ జయంతి వంటి జాతీయ సెలవు దినాల్లో మాత్రం ఎలాంటి డ్రా తీయరు. దీపావళి, నూతన సంవత్సరంతోపాటు మరో పండుగ రోజున పెద్ద డ్రా తీస్తారు. ఇతర రాష్ట్రాలు ఇప్పటికే లాటరీల ద్వారా భారీ ఆదాయం పొందుతున్నాయి. పంజాబ్ ఏటా రూ.235 కోట్ల ఆదాయాన్ని పొందుతుంటే, కేరళ ఏకంగా రూ.13,582 కోట్లు అర్జిస్తోంది.