లక్నో: కొన్నేళ్ల కిందట హత్యకు గురైన యువతి, హత్యా ఆరోపణలతో జైల్లో ఉన్న నిందితుడి తల్లికి సజీవంగా కనిపించింది. దీంతో పోలీసులు ఆ యువతిని అదుపులోకి తీసుకున్నారు. సినిమాను తలపించిన ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ జిల్లాలో జరిగింది. 2015లో 15 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. దీంతో ఆమె తండ్రి 18 ఏళ్ల యువకుడు విష్ణుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశాడని ఆరోపించాడు. దీంతో పోలీసులు విష్ణుపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. కొన్ని నెలల తర్వాత ఆగ్రాలో ఒక బాలిక మృతదేహం లభించింది. తన కుమార్తె మృతదేహమేనని ఆమె తండ్రి తెలిపాడు. ఈ నేపథ్యంలో విష్ణుపై హత్య కేసు కూడా చేర్చిన పోలీసులు అతడ్ని జైలుకు తరలించారు.
కాగా, తన కుమారుడు విష్ణు ఏ తప్పు చేయలేదని అతడి తల్లి గట్టిగా నమ్మింది. కుమారుడు ఎదుర్కొంటున్న హత్య కేసుపై దర్యాప్తును ఆమెనే స్వయంగా చేపట్టింది. కనిపించకుండా పోయిన బాలిక ఆచూకీ కోసం చాలా మందిని ఆరా తీయడంతోపాటు పలు ప్రాంతాల్లో వెతికింది. ఎట్టకేలకు ఏడేళ్ల తర్వాత ఆమె శ్రమ ఫలించింది. ఒక మత పరమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు హత్రాస్ వెళ్లిన నిందితుడి తల్లికి ప్రస్తుతం 22 ఏళ్ల వయసున్న మిస్సింగ్ యువతి కనిపించింది. దీంతో ఆమె వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలిపింది.
మరోవైపు స్పందించిన పోలీసులు ఆ యువతిని అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఆమెను అలీగఢ్ కోర్టులో ప్రవేశపెట్టారు. మంగళవారం మెజిస్ట్రేట్ ఎదుట ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేశారు. అలాగే ఆ యువతికి డీఎన్ఏ టెస్ట్ నిర్వహిస్తామని, తండ్రి డీఏఎన్తో పోల్చి చూస్తామని పోలీస్ అధికారి తెలిపారు. రిపోర్టులు వచ్చిన తర్వాత ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.