భారత్ బయోటెక్ తయారు చేసిన స్వదేశీ కరోనా టీకా కొవాగ్జిన్ను కొన్ని పరిమితులకు లోబడి 12-17 ఏండ్ల వారికి కూడా వేయడానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతినిచ్చింది. టీకాకు అత్యవసర వినియోగం కింద ఆమోదం లభించినట్టు అధికారులు శనివారం తెలిపారు. 18 ఏండ్ల లోపువారికి వేయడానికి డీసీజీఐ అనుమతి పొంది రెండో టీకా ఇది. ఇంతకుముందు జైడస్ క్యాడిలా టీకా జైకోవ్-డీకి అత్యవసర వినియోగం కింద అనుమతి లభించింది. భారత్ బయోటెక్ కొవాగ్జిన్ను 2-17 ఏండ్ల పిల్లలపై పరీక్షించింది. ట్రయల్స్ సమాచారాన్ని అక్టోబర్ నెలలో సీడీసీఎస్వోకు సమర్పించింది. కొవాగ్జిన్ను 2-17 ఏండ్ల పిల్లలకు ఇచ్చేందుకు అనుమతివ్వాలని అక్టోబర్ 11న సిఫారసు చేసింది. టీకా ట్రయల్స్పై అదనపు సమాచారం కోరిన డీసీజీఐ.. దానిని విశ్లేషించి 12 ఏండ్లు నిండిన వారికి మాత్రమే కొన్ని పరిమితులకు లోబడి వేయడానికి అనుమతించింది.