ముంబై: ఒక తల్లి రోజుల పసిబిడ్డను బిల్డింగ్ 14వ అంతస్తు పైనుంచి విసిరేసింది. (Woman throws days old daughter) కిందపడి తీవ్రంగా గాయపడిన ఆ పసిపాప చనిపోయింది. దివ్యాంగురాలైన ఆ మహిళ ఇలా ఎందుకు చేసింది అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. గురువారం సాయంత్రం ములుండ్ వెస్ట్లోని జావెర్ రోడ్లో విషాదం నెలకొన్నది. హైరైజ్ రెసిడెన్షియల్ బిల్డింగ్ 14వ అంతస్తులోని ఇంటి కిటికీ నుంచి 39 రోజుల పసిబిడ్డను తల్లి విసిరేసింది. బంధువైన వ్యక్తి ఆ చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే ఆ పసిపాప అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ మహిళపై హత్య కేసు నమోదు చేశారు. పసిబిడ్డను బిల్డింగ్ పైనుంచి విసిరేసిన ఆమెకు వినికిడి లోపంతోపాటు మూగ అని తెలిపారు. 2022 జూలైలో కూడా ఏడు నెలల కుమారుడికి ఆమె ఆహారం పెడుతున్న సందర్భంగా ఊపిరాడక చనిపోయినట్లు చెప్పారు. తాజాగా పసిపాపను 14వ అంతస్తులోని ఇంటి కిటికీ నుంచి కిందకు విసిరేయడం వెనుక ఆమె ఉద్దేశం ఏమిటన్నది తెలియలేదని పోలీస్ అధికారి అన్నారు. ఆ మహిళను ఇంకా అరెస్ట్ చేయలేదని, ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.