ఆగ్రా : డెన్మార్క్ ప్రధానమంత్రి మెట్టే ఫ్రెడెరిక్సెన్ ప్రేమ సౌధం తాజ్మహల్ను ఆదివారం ఉదయం సందర్శించారు. ఈ ప్రదేశంగా అద్భుతమైందని పేర్కొన్నారు. తాజ్మహల్ సందర్శన కోసం ఆమె తన భర్త టెంగ్బర్గ్తో కలిసి శనివారం రాత్రి ఆగ్రా ఎయిర్ఫోర్స్ స్టేషన్కు చేరుకున్నారు. అక్కడ యూపీ ఇంధనశాఖ మంత్రి శర్మ ఆమెకు స్వాగతం పలికారు. ఆ తర్వాత అమర్ విలాస్లో బస చేశారు. ఇవాళ ఉదయం 10.50గంటలకు తాజ్ మహల్ వద్దకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఆమెకు స్థానిక కళాకారులు ప్రదర్శనలతో ఘన స్వాగతం పలికారు. డానిష్ ప్రధాని గంటన్నరకుపైగా తాజ్మహల్లో ఉండగా.. గైడ్ ఆమెకు తాజ్ మహల్ గురించి వివరించారు. ఆ తర్వాత ఆమె సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు. ఈ సందర్భంగా ‘ఈ ప్రదేశం అందంగా ఉంది’ అని పేర్కొన్నారు. వీవీఐపీ సందర్శన సమయంలో తాజ్మహల్, ఆగ్రా కోటను రెండు గంటల పాటు మూసివేసినట్లు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు తెలిపారు. డానిష్ ప్రధాని తొలిసారిగా భారతదేశ పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే.