Cycling | న్యూఢిల్లీ, మే 21: జీవితంలో ఏ దశలోనైనా సైక్లింగ్ చేసినవారికి మోకాళ్ల నొప్పులు 17 శాతం, కీళ్లవాతం 21 శాతం తక్కువగా వచ్చే అవకాశాలున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. 60 ఏండ్ల వయసు కలిగిన 2600 మందికి పైగా వ్యక్తులను ఈ అధ్యయనంలో పరిశీలించారు. ఈ అధ్యయనం వివరాలు మెడిసిన్ & సైన్స్ ఇన్ స్పోర్ట్స్ & ఎక్సర్సైజ్ జర్నల్లో ప్రచురితమయ్యాయి.
ఈ అధ్యయనంలో ప్రధాన పరిశోధకుడైన హ్యూస్టన్కు చెందిన డాక్టర్ గ్రేస్ లో మాట్లాడుతూ సైక్లింగ్ వల్ల మోకాళ్ల ఆరోగ్యం బాగుంటుందని.. కీళ్లకు జరిగే నష్టం కూడా తక్కువని తెలిపారు. ఎనిమిదేండ్ల పాటు జరిగిన ఈ అధ్యయనంలో పాల్గొన్నవారిని వారి జీవితంలో వివిధ దశల్లో తీరిక సమయంలో చేసిన వ్యాయామాల గురించి ఆరా తీశారు. 12-18 ఏండ్ల వయసు కలిగినప్పుడు సైక్లింగ్ చేసినవారిలో కండరాలు బలపడ్డాయని..
ఆ తర్వాత వారు సైక్లింగ్ మానేసినా కండరాల పటిష్టత కొనసాగిందని అధ్యయనంలో తేలింది. మోకాళ్ల చుట్టూ ఉండే కండరాలు సైక్లింగ్ వల్ల దృఢంగా మారతాయని, కీళ్ల జాయింట్ల కదలికలు కూడా మెరుగవుతాయని పరిశోధకులు వివరించారు. సైక్లింగ్ వల్ల శరీర బరువు అదుపులో ఉంచుకోవచ్చని… అదనపు బరువు వల్ల కీళ్లపై ఒత్తిడి పెరుగుతున్నదని తెలిపారు.