ముంబై, మార్చి 18: సైబర్ కేటుగాళ్లు కొత్త తరహా మోసానికి తెర తీశారు. 16 రోజుల్లో 81మంది ముంబైవాసుల నుంచి రూ.1 కోటి కాజేశారు. ఈ కొత్త మోసంలో మోసగాళ్లు కావాలనే గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా మీ బ్యాంక్ ఖాతాకు కొంత డబ్బు పంపిస్తారు. ఆ తర్వాత పొరపాటున డబ్బు పంపించామని, ఆ డబ్బును తిరిగి చెల్లించాలని ఫోన్ చేస్తారు. మీరు మంచితనంతో డబ్బు తిరిగి పంపిస్తారు. అక్కడే మాల్వేర్ దాడికి మీరు బాధితులు అవుతారు. ఈ మోసాలపై ఢిల్లీకి చెందిన సైబర్ నేరాల నిపుణుడు పవన్ దుగ్గల్ స్పందించారు. ‘ఇది మాల్వేర్, మానవ ప్రేరేపిత ఇంజినీరింగ్ కుంభకోణం. మీరు గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా డబ్బు తిరిగి చెల్లించినప్పుడు బ్యాకింగ్, పాన్, ఆధార్ లాంటి కేవైసీ దస్ర్తాలు సహా మీ మొత్తం డాటా మోసగాళ్లకు అందుబాటులోకి వెళ్తుంది. ఎవరి బ్యాంకు ఖాతానైనా హ్యాక్ చేయడానికి ఈ డాక్యుమెంట్లు చాలు’ అని దుగ్గల్ పేర్కొన్నారు. మోసగాళ్లు డబ్బు తిప్పి పంపాలని అడిగినప్పుడు ఆ విషయాన్ని బ్యాంకు అధికారులు చూసుకుంటారని చెప్పాలని ప్రజలకు దుగ్గల్ సూచించారు. డబ్బును తీసుకోవడానికి దగ్గరలోని పోలీస్ స్టేషన్కు రావాలని చెప్పాలని తెలిపారు.