భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఉన్న ఓ గోశాలలో ఆదివారం భారీ సంఖ్యలో ఆవులు చనిపోయాయి. జిల్లా అధికారులు గోశాల నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ ప్రారంభించారు. భోపాల్ జిల్లా కలెక్టర్ అవినాష్ లావానియా ఆదేశాల మేరకు గోశాల ఉన్న బెరాసియా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గోశాల నిర్వహణపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ చనిపోయిన ఆవుల కళేబరాలను సేకరించి, మార్గదర్శకాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించనందుకు గోశాల డైరెక్టర్పై చర్యలు తీసుకోవాలని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ను కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్ర పశుసంవర్థక శాఖ జిల్లావ్యాప్తంగా ఉన్న ఆవులన్నింటికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ఆయన సూచించారు.
జిల్లా పరిషత్ సీఈవో వికాస్ మిశ్రా ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ.. గోశాలను బీజేపీకి చెందిన నిర్మలా శాండిల్య అనే నాయకురాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ఇదిలా ఉండగా, ఈ గోశాలలో ఆవు ఎముకలు, తోలు వ్యాపారం జరుగుతున్నదని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ సింగ్ ఆరోపించారు. దీనిని ఒక మహిళా బీజేపీ నాయకురాలు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇక్కడి గోశాలలో 500 పైగా ఆవులు చనిపోయాయని, అందుకుగాను గోశాల డైరెక్టర్లపై గోహత్య కేసు నమోదు చేయాలని డిగ్గీరాజా కోరారు. మహిళా బీజేపీ నాయకురాలు ఆవు తోలు, ఎముకల వ్యాపారంలో నిమగ్నమై ఉండి ఉంటే దానిపై దర్యాప్తు చేపట్టాని, ఈ గోశాలకు అనుమతి మంజూరుపై కూడా విచారణ జరపాలని దిగ్విజయ్సింగ్ డిమాండ్ చేశారు.