న్యూఢిల్లీ, జూలై 5: దేశంలో వ్యాక్సినేషన్ నిర్వహణ కోసం తీసుకొచ్చిన ‘కొవిన్’ ప్లాట్ఫామ్ సాఫ్ట్వేర్ను త్వరలోనే అన్నిదేశాలకు అందిస్తామని ప్రధాని మోదీ అన్నారు. మహమ్మారి కట్టడిలో అన్ని దేశాలకు సాయపడేందుకు భారత్ ఎప్పుడూ ముందుంటుందని పునరుద్ఘాటించారు. కరోనా కట్టడికి వ్యాక్సినేషనే మార్గమన్నారు. సోమవారం జరిగిన ‘కొవిన్ అంతర్జాతీయ సదస్సు’లో ప్రధాని మాట్లాడారు. కొవిడ్పై పోరులో సాంకేతికత కీలక పాత్ర పోషించిందన్న మోదీ.. టెక్నాలజీకి పరిమితులు ఉండబోవన్నారు. ప్రపంచమంతా ఒకే కుటుంబం అని భారతీయులు గట్టిగా విశ్వసిస్తారని, మహమ్మారి విజృంభణ తర్వాత ప్రపంచ దేశాలు కూడా దీన్ని నమ్ముతున్నట్టు చెప్పారు. కాగా ‘కొవిన్’ సాఫ్ట్వేర్పై కెనడా, మెక్సికో, నైజీరియా, పనామా వంటి 50కి పైగా దేశాలు ఆసక్తిగా ఉన్నట్టు ఎన్హెచ్ఏ సీఈవో ఆర్ఎస్ శర్మ ఇటీవల చెప్పారు.
ప్రజా సంక్షేమం కోసం..
ప్రజల సంక్షేమం కోసం, వ్యాక్సినేషన్ను వేగవంతం చేయడానికి కొవిన్ సాంకేతికతను ఇతర దేశాలకు అందిస్తున్నట్టు కేంద్ర మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నా రు. కరోనా కట్టడికి అవసరమైన సాంకేతికతను ఇతర దేశాలతో పంచుకునేందుకు భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా అన్నారు. ఇతర దేశాలకు సాయాన్ని అందించేందుకు భారత్ ఎప్పుడూ ముందున్నదని గుర్తుచేశారు.