న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల చేసిన ప్రకటన మేరకు దేశవ్యాప్తంగా 15-18 ఏండ్ల మధ్య వయసు పిల్లలకు రేపటి (సోమవారం) నుంచి వ్యాక్సినేషన్ షురూ కానున్నది. కేంద్ర, రాష్ట్ర ఆరోగ్యశాఖల అధికారులు ఈ మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. పిల్లల వ్యాక్సినేషన్ కోసం కొవిన్ రిజిస్ట్రేషన్ శనివారమే ప్రారంభమైంది. తాము రోజుకు మూడు లక్షల మంది పిల్లలకు వ్యాక్సిన్లు ఇచ్చేలా ఏర్పాట్లు చేశామని ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్రజైన్ చెప్పారు. పిల్లలకు వ్యాక్సినేషన్ కోసం తాము ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జి తెలిపారు.
15-18 ఏండ్ల మధ్య వయసు పిల్లలందరికీ జనవరి మూడో తేదీ నుంచి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ గత డిసెంబర్ 25న ప్రకటించారు. థర్డ్ వేవ్ కట్టడి కోసం, వైరస్ కొత్త పరివర్తనలను నిలువరించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ ఏజ్ గ్రూప్ వారికి కొవాగ్జిన్ టీకాను వినియోగించవచ్చని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. 2007 లేదా అంతకంటే ముందు జన్మించిన వారంతా టీకాలు వేసుకోవాలని సూచించింది.