న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ ఇంకా సమసిపోలేదని ఎలాంటి పరిస్థితిలోనూ మనం మహమ్మారిని తేలికగా తీసుకోరాదని ఏడాదిన్నర అనుభవం వెల్లడిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్తో మంత్రి మంగళవారం వర్చువల్ భేటీలో మాట్లాడారు.
కొవిడ్-19 సెకండ్ వేవ్ ఇంకా ముగిసిపోలేదని, ఢిల్లీలో కేసులు గణనీయంగా తగ్గినా మనం విశ్రమించరాదని స్పష్టం చేశారు. ప్రజలు, సమాజం కూడా మహమ్మారి తగ్గుముఖం పట్టిందని విశ్రమించరాదని, మనం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. గత ఆరు నెలలుగా కరోనా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు పెద్దసంఖ్యలో వ్యాక్సిన్లు వేయించుకోవడం, కరోనా నిబంధనలను పాటించడం ద్వారా కొవిడ్-19పై పోరులో మనం విజయం సాధించవచ్చని పేర్కొన్నారు.