న్యూఢిల్లీ: కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో దేశంలో కరోనా కేసుల తీవ్రత మళ్లీ పెరుగుతున్నది. దీంతో పలు సంస్థలు కరోనా థర్డ్ వేవ్పై స్టడీ చేస్తున్నాయి. దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న తీరును పరిశీలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో రెండు వారాల్లో అంటే ఫిబ్రవరి 6 నాటికి కరోనా థర్డ్ వేవ్ గరిష్ఠస్థాయికి చేరుతుందని ఐఐటీ మద్రాస్ అధ్యయనం పేర్కొంది. కరోనా వైరస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో సూచించే భారతదేశపు ఆర్ విలువ జనవరి 14- 21 వారంలో 1.57కి తగ్గిందని నిర్ధారించింది.
కాగా, ఆర్ విలువ అనేది కరోనా సోకిన వ్యక్తి వైరస్ని ఎంతమందికి వ్యాప్తి చేయగలరో అన్నది సూచిస్తుంది. జనవరి 7-13 వారంలో 2.2గా, జనవరి 1-6 వారంలో 4గా, గత ఏడాది డిసెంబర్ 25- 31 వారంలో 2.9గా ఆర్ విలువ నమోదైందని ఐఐటీ మద్రాస్ స్టడీ తెలిపింది. ప్రస్తుతం చెన్నైలో ఆర్ విలువ 1.2, ముంబైలో 0.67, ఢిల్లీలో 0.98, కోల్కతాలో 0.56గా ఉన్నట్లు ఆ డేటా వెల్లడించింది. ఆర్ విలువ 1 కంటే తక్కువకు పడిపోతే, కరోనా మహమ్మారి ముగిసినట్లుగా పరిగణిస్తారు.
ఈ నేపథ్యంలో ఇప్పటికే ముంబై, కోల్కతాలో ఆర్ విలువ గరిష్ఠ స్థాయికి చేరుకున్న తర్వాత స్థానిక స్థితికి మారుతున్నదని ఐఐటీ మద్రాస్ అధ్యయనం పేర్కొంది. అయితే ఢిల్లీ, చెన్నైలో ఇది ఇప్పటికీ 1కి దగ్గరగా ఉందని మద్రాస్ ఐఐటీ గణిత విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జయంత్ ఝా తెలిపారు. దీంతో తమ విశ్లేషణ ప్రకారం, వచ్చే 14 రోజుల్లో అంటే ఫిబ్రవరి 6 నాటికి కరోనా వైరస్ పీక్ స్టేజ్కు చేరే అవకాశం ఉందని ఝా అన్నారు.
కాగా, ఐఐటీ మద్రాస్ గణిత విభాగం, సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఫర్ కంప్యూటేషనల్ మ్యాథమెటిక్స్ అండ్ డేటా సైన్స్ ద్వారా కంప్యూటేషనల్ మోడలింగ్ ద్వారా కరోనా గరిష్ఠ స్థాయిపై ప్రాథమిక అధ్యయనం జరిగింది. ప్రొఫెసర్ నీలేష్ ఎస్ ఉపాధ్యాయ, ప్రొఫెసర్ ఎస్ సుందర్ దీనికి నాయకత్వం వహించారు.