న్యూఢిల్లీ: కోవిడ్ వేళ స్కూళ్ల మూసివేత విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపింది. స్కూళ్లు మూసివేయడం వల్ల దేశవ్యాప్తంగా సుమారు 32 కోట్ల మంది చిన్నారులపై ప్రభావం చూపినట్లు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. మహిళల సాధికారత పార్లమెంటరీ కమిటీకి విద్యాశాఖ ఈ విషయాన్ని చెప్పింది. దీనిపై కేంద్ర విద్యాశాఖ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. బేటీ బచావో.. బేటీ పడావోపై నివేదికను పార్లమెంట్కు అందజేసింది. దాంట్లో స్కూళ్ల మూసివేత వల్ల దేశవ్యాప్తంగా 32 కోట్ల మంది చిన్నారులపై ప్రభావం పడినట్లు చెప్పింది. వారిలో 15.8 కోట్ల మంది అంటే.. సుమారు 49.37 శాతం మంది అమ్మాయిలు ఉన్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. మహమ్మారి సమయంలో కౌమార దశలో ఉన్న బాలికలపై తీవ్ర ప్రభావం పడినట్లు అధికారులు చెప్పారు. మహమ్మారి ముగిసిన తర్వాత బాలికలు ఎక్కువ స్థాయిలో చదువులకు దూరం అయ్యే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేశారు. ఒకే ఒక్క స్మార్ట్ఫోన్ ఉన్న ఇండ్లల్లో.. బాలికలకు ఆన్లైన్ విద్య దూరం అవుతున్నట్లు విద్యాశాఖ తన నివేదికలో చెప్పింది. స్కూల్కు రాని విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరిగినట్లు కూడా విద్యాశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. 2020-2021లో పది లక్షల మంది చిన్నారులు స్కూల్కు డుమ్మా కొడితే.. ఇక ఈ ఏడాది ఆ సంఖ్య 27.85 లక్షలకు చేరినట్లు విద్యాశాఖ వెల్లడించింది.