న్యూఢిల్లీ : ఢిల్లీ కంజావాలారోడ్డు ప్రమాదంలో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అశుతోష్ భరద్వాజ్ బెయిల్ పిటిషన్ను రోహిణి కోర్టు తోసిపుచ్చింది. కేసు ఇంకా ప్రారంభదశలోనే ఉందని, ప్రతి నిందితుడి పాత్రను విచారించాల్సి ఉందని పబ్లిక్ ప్రాస్రిక్యూటర్ కోర్టు దృష్టికి తీసుకురాగా.. ఈ మేరకు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సన్యా దలాల్ బెయిల్ను తిరస్కరించారు. యువతి యాక్సిడెంట్ కేసును ప్రత్యేకంగా కోర్టు విచారిస్తున్నది. అయితే, ఘ టన సమయంలో నిందితుడు కారులో లేడని అశుతోష్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే, నిందితులకు ఆశ్రయం కల్పించినట్లు ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.
ఘటనకు సంబంధించి సమాచారం ఇవ్వలేదని తెలిపారు. అయితే, అశుతోష్ భరద్వాజ్ తరఫున న్యాయవాది శిల్పేష్ చౌదరి వాదనలు వినిపిస్తూ.. ఘటన జరిగిన సమయంలో అతను ఇంట్లోనే ఉన్నాడనేందుకు రుజువులు ఉన్నాయంటూ వీడియోలను కోర్టుకు సమర్పించారు. ఎస్ఎస్పీ అతుల్ శ్రీవాస్తవ స్పందిస్తూ.. వీడియో ఎవిడెన్స్ యాక్ట్ సర్టిఫికెట్ సెక్షన్ 65బి లేకుండా ఉన్నందున ప్రామాణికతను నిర్ధారించడం సాధ్యం కాదన్నారు. అలాగే సంఘటన జరిగిన సమయంలో అతను (అశుతోష్) కారులో ఉన్నాడని తాము ఎప్పుడు చెప్పలేదన్నారు. కారును అధికారం లేని వ్యక్తి ఇచ్చాడని, ప్రమాదానికి సంబంధించి సమాచారం తెలిసినా పోలీసులకు చెప్పలేదని ఎస్ఎస్పీ వాదించారు.
కారును నడిపింది ఒకరైతే.. మరొకరి పేరు చెప్పాడని, అతని ప్రవర్తన సరిగా లేదన్నారు. కేసుపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని కోర్టుకు తెలిపారు. తప్పు చేయనప్పుడు అదుపులో ఉంచుకోవడంలో ఉద్దేశం ఏంటని, ఇతరుల చర్యలకు అతనెలా (అశుతోష్) బాధ్యుడని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించిన ఢిల్లీ రోడ్డు ప్రమాద ఘటనలో అశుతోష్ సైతం నిందితుడు. జనవరి ఒకటిన ఔటర్ ఢిల్లీలోని కంఝావాలా ప్రాంతంలో ఐదుగురు యువకులు నడుపుతున్న కారు ఓ యువతిని ఢీకొట్టి ఈడ్చుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అంజలి సింగ్ (20) అనే యువతి ప్రాణాలు కోల్పోయింది. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతున్నది.