న్యూఢిల్లీ: మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కలేదు. తన అరెస్టు, రిమాండ్ను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. కేజ్రీవాల్ అరెస్టు, రిమాండ్ చట్టవిరుద్ధం కాదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ స్వరణ కాంత శర్మ మంగళవారం తీర్పు వెలువరించా రు. కేజ్రీవాల్ అరెస్టుకు ఈడీ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా, ఢిల్లీ హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారని ఆప్ పేర్కొన్నది. ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మంత్రి సౌరవ్ భరద్వాజ్ మీడియాతో మాట్లాడుతూ మద్యం పాలసీ కేసు కేజ్రీవాల్, ఆయన పార్టీని అణచివేసేందుకు జరిగిన ఒక పెద్ద రాజకీయ కుట్ర అని ఆరోపించారు. హైకోర్టు తీర్పు తమకు ఆమోదయోగ్యంగా లేదని, దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తామ ని తెలిపారు. మద్యం పాలసీ కేసుల్లో దర్యాప్తు చేస్తున్న ఈడీ, సీబీఐ ఇప్పటి వరకు ఒక్క రూపాయి అక్రమ సొమ్ము కూడా రికవరి చేయలేదని అన్నారు. ఈ కేసు ఒక రాజకీయ కుట్ర అని వ్యాఖ్యానించారు.