ముంబై: చీరల కోసమో, నగల కోసమో భర్తతో భార్య గొడవపడిన ఘటనల గురించి వింటుంటాం..! వంట సరిగా చేయలేదని భార్యతో భర్త గొడవపడిన సందర్భాలూ చూస్తుంటాం..! ఇవేగాక, ఇంకా ఇతర చాలా కారణాలతో కూడా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుంటాయి..! కానీ, ముంబైలోని ఓ జంట మధ్య మాత్రం ఒక విచిత్రమైన కారణంతో గొడవ జరిగింది. చివరకు ఆ గొడవ ఎక్కడికో దారితీసింది..! ఇంతకూ ఆ గొడవేందో తెలుసుకుందామా..?
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని బొరివ్లీ ఏరియా రాంబాగ్ లేన్కు చెందిన ఓ జంట మధ్య గత కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఇద్దరికీ ఒకరంటే ఒకరు గిట్టని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఇద్దరం విడాకులు తీసుకుందామని గత ఏడాది ఏప్రిల్లో భార్య ప్రతిపాదించింది. అయితే, అందుకు భర్త ఒప్పుకోలేదు. దాంతో ఇద్దరికీ పొసగకపోయినా ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు.
ఇంట్లో వస్తువులను, పనులను పంచుకుని కాపురం చేస్తున్నారు. టీవీ, మంచం లాంటి విడదీయలేని, కలిసి వినియోగించలేని వస్తువులను టైమింగ్ పెట్టుకుని వంతుల వారీగా వాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ఒంటిగంటకు భర్త.. ఇంట్లో మంచంపై నిద్రిస్తున్న భార్యను నిద్రలేపాడు. తాను రెస్ట్ తీసుకోవాలి మంచం మీద నుంచి లెమ్మన్నాడు. అందుకు ఆమె ‘ఇది నా టైమ్ నేను మంచం ఇవ్వను’ అని సమాధానం చెప్పింది.
దాంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. అది కాస్తా కొట్టుకునే వరకు వెళ్లింది. చివరికి ఆగ్రహంతో ఊగిపోయిన భర్త.. భార్య చెంపపై గట్టిగా చరిచాడు. చేయి కాస్త ఆమె చెవిపై తగలడంతో కీస్మన్న శబ్దమే తప్ప వినికిడి లేకుండా పోయింది. దాంతో ఆమె తన స్నేహితురాలికి ఫోన్ చేసి పిలిపించుకుని ఆస్పత్రికి వెళ్లింది. పరీక్షించిన వైద్యులు లోపలి చెవి దెబ్బతిన్నదని చెప్పారు. అంతే, అక్కడి నుంచి నేరుగా బొరివ్లీ పోలీస్స్టేషన్కు వెళ్లి భర్తపై ఫిర్యాదు చేసింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 325 కింద అతనిపై కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించి తాము భర్తపై కేసు నమోదు చేశామని, అతడిని కస్టడీలోకి తీసుకున్నామని, కేసు తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నదని పోలీసులు తెలిపారు.