లక్నో: ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి పట్టిపీడిస్తుంటంతో ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్క్ ధరించడం తప్పనిసరిగా మారిపోయింది. దాంతో మార్కెట్లోకి రకరకాల డిజైన్లతో డిజైనర్ మాస్కుల రాక మొదలైంది. కానీ ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక సాధువు మాత్రం రంగురంగుల డిజైన్లతో మార్కెట్లో దొరుకుతున్న ఖరీదైన మాస్కుకలు కరోనా మహమ్మారిని కట్టడి చేస్తాయన్న గ్యారంటీ ఉందా..? అని ప్రశ్నిస్తున్నారు. అదే వనమూలికలతో తయారు చేసిన హెర్బల్ మాస్కులు ధరిస్తే మాత్రం కరోనాతోపాటు మరే వైరస్కు ధరిచేరదని ఆయన చెబుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ పరిసరాల్లో సంచరించే ఓ సాధువును స్థానికులు జుగాడి బాబా అని పిలుస్తుంటారు. ఆయన వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వనమూలికలతో చేసిన ఔషధాలు ఇచ్చి స్వస్థత చేకూరుస్తుంటారు. ఈ క్రమంలోనే ఆయన వనమూలికలతో మాస్కును రూపొందించారు. ఈ మాస్కు ధరిస్తే కరోనాతోపాటు మరే వైరస్ కూడా మన ధరికి చేరదని ఆయన స్పష్టం చేస్తున్నారు.
ఈ హెర్బల్ మాస్కును నిమ్మ ఆకులు, తులసి ఆకులతోపాటు మరికొన్ని వన మూలికలతో కలిపి తయారు చేసినట్లు జుగాడి బాబా తెలిపారు. ఈ మాస్కును ధరిస్తే కరోనా మహమ్మారి మీ చెంతకే రాదు అంటున్నాడు జుగాడి బాబా. ఈ వనమూలికల మాస్కు కొవిడ్ నుంచి రక్షణ కల్పిస్తున్నదని, ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని అంటున్నాడు. ఈ ఆకుల్లో ఉండే గుణాలు ఎటువంటి అనారోగ్యాన్ని దరిచేరనివ్వవని చెబుతున్నాడు.