న్యూఢిల్లీ, మార్చి 25: దేశంలో మొదలైన కరోనా సెకండ్ వేవ్ ఇప్పట్లో ముగియబోదని, మే చివరివారం వరకూ ఈ పరిస్థితి కొనసాగనుందని తెలుస్తున్నది. అంటే, మరో రెండు నెలలపాటు జాగ్రత్తలతో, వ్యాక్సినేషన్తో కరోనా నుంచి కాపాడుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు, ఇప్పుడు కొనసాగుతున్న ఉద్ధృతి మరింత పెరిగి వచ్చే నెల మధ్యకు (ఏప్రిల్ 15 ప్రాంతంలో) పీక్స్టేజీకి చేరనుంది. ఈ వివరాల్ని ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)’ నిపుణుల బృందం తన నివేదికలో వెల్లడించింది. నివేదికలోని ముఖ్యాంశాలు..
వ్యాక్సినేషన్తోనే వైరస్ కట్టడి
స్థానిక లాక్డౌన్లు, ఆంక్షలు విధించడం వంటి చర్యలతో వైరస్ని కట్టడి చేయలేమని ఎస్బీఐ నివేదిక అభిప్రాయపడింది. వ్యాక్సినేషన్ను వేగవంతం చేయడమే మహమ్మారి కట్టడికి సరైన మార్గమని సూచించింది. ఈ క్రమంలో 1918-19లో ప్రపంచాన్ని అతలాకుతలం చేసి దాదాపు 5 కోట్ల మందిని పొట్టనబెట్టుకున్న గ్రేట్ పాండమిక్ ఫ్లూ (స్పానిష్ ఫ్లూ) ఘటనను ఉదహరించింది. ఫ్లూ కట్టడికి బడులు, చర్చిలు, థియేటర్లను మూసివేశారని, తిరిగి తెరవగానే వైరస్ మళ్లీ విజృంభించిందని వెల్లడించింది.
పట్టణాల్లోనే కేసులెక్కువ!
గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాలు, నగరాల్లోనే వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని నివేదిక తెలిపింది. 60 ఏండ్లుపైబడిన వారు ఎక్కువగా ఉన్న పంజాబ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నదని పేర్కొన్నది.
నాలుగు నెలలు పడుతుంది
ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోజుకు గరిష్ఠంగా 35 లక్షల వ్యాక్సిన్ డోసులను ఇస్తున్నారని నివేదిక పేర్కొంది. టీకా డోసుల పంపిణీని రోజుకి 40-45 లక్షలకు పెంచినప్పటికీ, 45 ఏండ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందించడానికి మరో 4 నెలల సమయం పట్టే అవకాశమున్నదని అంచనా వేసింది. అయితే, ప్రస్తుతం రోజుకు సగటున 22 లక్షల డోసులనే ఇస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.