ఈ నెలాఖరుకు పీక్ స్టేజ్కు కరోనా కేసులు
సెకండవేవ్ వ్యవధి తక్కువైనా.. ఉద్ధృతి ఎక్కువ
పలువురు నిపుణుల అంచనాలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: దేశంలో కరోనా సెకండ్ వేవ్ అంతకంతకూ ఉద్ధృతమవుతున్నది. రికార్డుస్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతాయి. సెకండ్ వేవ్ తక్కువ వ్యవధితో ఎక్కువ ఉద్ధృతితో కొనసాగనున్నదని వైరాలజిస్ట్ జాకబ్ జాన్, బయోఎథిక్స్, పాలసీ నిపుణులు ఆనంద్, సాంక్రమిక వ్యాధినిపుణులు డేవిడ్ హేమన్ అభిప్రాయపడ్డారు. దేశంలో ఏప్రిల్ చివరినాటికి కేసులు గరిష్ఠస్థాయికి చేరకుంటాయని అంచనా వేశారు. జూన్నాటికి ఎండెమిక్ స్టేజ్కి (కేసులు సాధారణ స్థాయికి రావడం) వస్తాయని పేర్కొన్నారు. వైరస్ ఉత్పరివర్తనం చెంది వేగంగా వ్యాపించడం, ప్రజలు, రాజకీయ నాయకులు కరోనా మార్గదర్శకాలు పాటించకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే కేసులు భారీగా పెరుగుతున్నాయని వివరించారు. దేశంలో వైరస్ సీక్వెన్సింగ్ తగిన విధంగా జరుగడం లేదని, ఇది వ్యవస్థాగతమైన లోపమని పేర్కొన్నారు. బ్రిటన్లో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున సీక్వెన్సింగ్ నిర్వహిస్తున్నారని వెల్లడించారు. వ్యాక్సిన్ బూస్టర్ డోస్ ఇవ్వడం ద్వారా ఉత్పరివర్తనాలను చాలా వరకు ఎదుర్కొనవచ్చని పేర్కొన్నారు. వైరస్తో కలిసి జీవించడం తప్పదన్నారు. మహమ్మారిని పూర్తిగా నిర్మూలించడం అతిపెద్ద సవాల్ అని, పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ ద్వారానే వైరస్ను నియంత్రించగలమని పేర్కొన్నారు.