ఉమ్మడి జిల్లాలో60 కేసులు
నాందెడ్లో నేటి నుంచి లాక్డౌన్ అమలు
సరిహద్దుల్లో కొనసాగుతున్నకరోనా పరీక్షలు
విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడంతో ఇంటికి పయనమైన విద్యార్థులు
రెంజల్, మార్చి 24: కరోనా మహమ్మారి మహారాష్ట్ర ప్రజలకు మరోసారి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వణుకు పుట్టిస్తున్నది. అప్రమత్తమైన అక్కడి ఉన్నత అధికారులు గురువారం నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు లాక్డౌన్ విధిస్తున్నారు. నాందెడ్ పట్టణంలో బుధవారం నిర్వహించిన కరోనా టెస్టులో ఏడు వందలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో లాక్డౌన్ విధించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 15 రోజులుగా రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు అమల్లో ఉన్న లాక్ డౌన్ను పగలు కూడా అమలు చేస్తున్నట్లు నాందెడ్ పట్టణ పోలీసులు మైక్లో ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
అంతర్రాష్ట్ర సరిహద్దు కందకుర్తి వద్ద నిఘా కరువు..
మహారాష్ట్ర – తెలంగాణ సరిహద్దు గ్రామమైన రెంజల్ మండలం కందకుర్తి గ్రామ శివారులో ఆరోగ్య, రెవెన్యూ, వైద్య శాఖల సమన్వయంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేకంగా షెడ్డును ఏర్పాటు చేశారు. మండలాన్ని ఆనుకొని ఉన్న ధర్మాబాద్ నుంచి బోధన్ బస్సుల్లో ప్రయాణించే వారికి కందకుర్తి చెక్ పోస్టు వద్ద థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బోధన్ మండలం సాలురా వద్ద ఇటీవల ఉన్నతాధికారులు నిఘా కట్టుదిట్టం చేయడంతో రూట్ మార్చిన మరాఠాలు ధర్మాబాద్ నుంచి 11 కిలో మీటర్ల దూరంలోనే ఉన్న కందకుర్తి మీదుగా కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. కందకుర్తి వద్ద వైద్య సిబ్బంది మాత్రమే ఉండడంతో వారిని ఆపేవారు లేరు. రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామంలో ప్రతి శనివారం జరిగే వారంతపు సంతలో పశువులు, గేదెల క్రయవిక్రయాలు నిర్వహించేందుకు మహారాష్ట్రలోని నాందెడ్, జాల్నా, ఔరంగాబాద్, పర్బని ఇతర ముఖ్య పట్టణాల నుంచి తరలి వస్తున్నారు. ధర్మాబాద్ మిర్చికి మంచి పేరు ఉండడంతో అక్కడ మిర్చిని పట్టించుకునేందుకు జిల్లా నలుమూలల నుంచి కందకుర్తి మీదుగా ప్రతి రోజూ ఆటోల్లో పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. వైద్యసిబ్బంది పగలు విధులు నిర్వహించగా, రాత్రింబవళ్లు డ్యూటీ చేసే పోలీస్, రెవెన్యూ శాఖల వారు నామ్కే వాస్తేగా పని చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. షెడ్డు వద్ద విద్యుత్, తాగునీటి సౌకర్యం లేకపోవడం కూడా ఒక కారణమవుతున్నది. ఉన్నతాధికారులు తగిన సౌకర్యాలు కల్పించి కరోనా వ్యాప్తి ముప్పును అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.