లక్నో: ఉత్తరప్రదేశ్ ఇటీవల నిర్మించిన కరోనా మాతా ఆలయాన్ని కూల్చివేశారు. భూ ఆక్రమణల ఆరోపణల నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. కరోనా మహమ్మారి బారిన పడకుండా అమ్మవారి రక్షణ కోసం ప్రయాగ్రాజ్లోని జూహి షుకుల్పూర్ గ్రామంలో ఈ నెల 7న కరోనా మాతా ఆలయాన్ని నిర్మించారు. లోకేశ్ కుమార్ శ్రీవాస్తవ అనే వ్యక్తి స్థానికంగా నిధులు సేకరించారు. తనతోపాటు నగేశ్ కుమార్ శ్రీవాస్తవ, జైప్రకాశ్ శ్రీవాస్తవకు సంయుక్తంగా చెందిన స్థలంలో కరోనా మాతా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రాధే శ్యామ్ వర్మ అనే వ్యక్తిని పూజారిగా నియమించారు. దీంతో స్థానిక, పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు కరోనా మాతా ఆశీసుల కోసం గత ఐదు రోజులుగా ఈ ఆలయానికి పోటెత్తారు.
మరోవైపు కరోనా మాతా ఆలయం నిర్మాణం అనంతరం లోకేష్ కుమార్ శ్రీవాస్తవ తాను నివాసం ఉండే నోయిడాకు తిరిగి వెళ్లారు. అయితే తన భూమిని ఆక్రమించేందుకు తనకు చెందిన స్థలంలో కరోనా మాతా గుడి కట్టినట్లు నగేశ్ కుమార్ శ్రీవాస్తవ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం రాత్రి కరోనా మాతా గుడిని కొందరు కూల్చివేశారు. అయితే పోలీసులే దీనిని కూల్చినట్లుగా స్థానికులు ఆరోపించగా పోలీసులు ఖండించారు. భూ వివాదమే కారణమని, దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.