న్యూఢిల్లీ, జూన్ 13: అయోధ్యలోని రామ మందిరానికి అందిన విరాళాలు దుర్వినియోగం అయినట్లు వచ్చిన ఆరోపణలు సంఘ్ పరివార్లో ఆందోళనలు పెంచుతున్నాయి. ఆలయ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ట్రస్ట్ ఈ వ్యవహారాన్ని పారదర్శకంగా నిర్వహించకపోవడం వల్ల అనుమానాలు, ఊహాగానాలు మరింత బలపడ్డాయి. అధికారి బీజేపీకి చెందిన కనీసం ఇద్దరు వ్యక్తులు ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ జోక్యాన్ని కోరగా ఆలయంతో సంబంధం ఉన్న ఒక ప్రముఖ హిందూ మత గురువు మాత్రం ఆరోపణలపై విచారణ జరుపుతున్నట్లు చెబుతున్న ట్రస్ట్ సభ్యుల చిత్తశుద్ధినే ప్రశ్నించారు. సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఎక్స్ వేదికగా ఆరోపణలు చేసిన తర్వాత జూన్ 7న ఈ వివాదం చెలరేగింది. దీనికి స్పందనగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తన ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ద్వారా ఒక వివరణను మాత్రమే విడుదల చేసింది. విశ్వ హిందూ పరిషత్ సీనియర్ నాయకుడైన రాయ్ మాట్లాడుతూ ట్రస్ట్ట్ తన కార్యకలాపాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అంతర్గత ఆడిట్లు నిర్వహిస్తుందని, ప్రస్తుతం అటువంటి ప్రక్రియే కొనసాగుతున్నదని తెలిపారు. అయితే ఇప్పటివరకు గణనీయమైనదేదీ వెలుగులోకి రాలేదని ఆయన పేర్కొన్నారు.
అయితే ఈ వివరణ ప్రతిపక్షాలను కాని, కాషాయ శిబిరం సభ్యులను కాని సంతృప్తిపరచడంలో విఫలమైంది. అయోధ్యకు చెందిన దంత వైద్యుడు, బీజేపీ నాయకుడు రజనీష్ సింగ్ సీబీఐ లేదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వంటి స్వతంత్ర సంస్థతో ఈ విషయమై దర్యాప్తు జరపాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ట్రస్ట్ బ్యాంకు ఖాతాలో విరాళాల సేకరణ, లెక్కింపు, రవాణా, జమ చేసే మొత్తం ప్రక్రియపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని కూడా సింగ్ డిమాండ్ చేశారు. ట్రస్ట్ మౌనం ఏదో ఒక రకమైన అక్రమం జరిగిందనే అనుమానాలను రేకెత్తిస్తున్నది. దీనిపై విచారణ జరగాలి అని ఆయన అన్నారు. ఆరోపణల విషయంలో మొదట్లో తనకు స్పష్టత లేనప్పటికీ ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ వారసుడైన కమల్ నయన్ దాస్ బహిరంగ ప్రకటన చేసిన తర్వాత తన సందేహం బలపడిందని సింగ్ పేర్కొన్నారు. ఈ వ్యమహారంపై విచారణ జరగాలని తాను కోరుకుంటున్నట్లు బుధవారం(జూన్ 10) నయన్ దాస్ స్థానిక మీడియాతో చెప్పారు. అదే సమయంలో విచారణ చేపడుతున్న ట్రస్టు సభ్యులపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. కాగా, బీజేపీ సభ్యుడు, అలహాబాద్ హైకోర్టు న్యాయవాది మురళీధర్ సింగ్ కూడా మోదీకి లేఖ రాస్తూ విరాళాల దుర్వినియోగం, అపహరణ ఆరోపణలపై ఉన్నత స్థాయి కేంద్ర సంస్థతో నిష్పక్షిక విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్) చేత ఆడిట్ నిర్వహించాలని కూడా ఆయన కోరారు.
సిట్ ఏర్పాటు చేసిన యూపీ ప్రభుత్వం
అయోధ్యలోని రామ మందిర ట్రస్టుకు చెందిన విరాళాలు, ఆర్థిక అవకతవకలపై వచ్చిన ఆరోపణలను దర్యాప్తు చేసేందుకు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం శనివారం ముగ్గురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) నియమించింది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అభ్యర్థనను పరిగణనలోనికి తీసుకొని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశం మేరకు సిట్ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. సిట్ సభ్యులుగా లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్, ఐజీ కిరణ్ ఎస్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్ ఉంటారు. ఈ ఆరోపణలపై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి సంపత్ రాయ్ మాట్లాడుతూ, అంతర్గత తనిఖీలు(ఆడిట్స్) జరుగుతున్నాయని వెల్లడించారు. ఆ ఆరోపణలకు మద్దతుగా ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లభించలేదని తెలిపారు.