గువాహటి, జూన్ 1: జేసీబీ ఇండస్ట్రీస్.. అస్సాం బీజేపీ సీఎం హిమంత బిశ్వ శర్మ భార్యకు చెందిన కంపెనీ. జీఆర్డీ ఫార్మా, మెడిటైమ్ హెల్త్కేర్.. హిమంత కుటుంబసభ్యులకు వాటా ఉన్న కంపెనీలు ఇవి. 2020లో దేశవ్యాప్త లాక్డౌన్ విధించడానికి ముందు ఈ మూడు కంపెనీలకు అస్సాం ప్రభుత్వం హడావుడిగా మెడికల్ కాంట్రాక్టులు ఇచ్చింది.
ఈ కాంట్రాక్టులో విఫలం అయినప్పటికీ మళ్లీ ఇవే కంపెనీలకు టెండర్లు ఇచ్చింది. మునుపటి కంటే ఎక్కువ ధరలకు కోట్ చేసినా కూడా టెండర్లను ఈ కంపెనీలకే కేటాయించడం గమనార్హం. జేసీబీ ఇండస్ట్రీస్ శానిటరీ ప్యాడ్ల వ్యాపారం చేస్తున్నది. పీపీఈ కిట్ల తయారీలో ఏ మాత్రం అనుభవం లేదు. అయినప్పటికీ అస్సాం ప్రభుత్వం ఈ కంపెనీకి 5 వేల పీపీఈ కిట్ల సరఫరాకు కాంట్రాక్టు ఇచ్చింది.
ఇందుకోసం కనీసం టెండర్లు కూడా నిర్వహించలేదు. అప్పనంగా కాంట్రాక్టును ఇచ్చేసింది. ఈ సమయంలో హిమంత బిశ్వ శర్మ అస్సాం ఆరోగ్య మంత్రిగా ఉన్నారు. జీఆర్డీ ఫార్మా, మెడిటైమ్ సంస్థలు అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో వైద్య పరికరాలు సరఫరా చేయడానికి అస్సాం ప్రభుత్వం ఎంపిక చేసింది.
కానీ ఈ మూడు కంపెనీలు తమ కాంట్రాక్టును సకాలంలో, నిబంధనల మేరకు పూర్తి చేయలేదు. అయినప్పటికీ అస్సాం ప్రభుత్వం తదుపరి టెండర్లలో ఈ కంపెనీలనే ఎంచుకొన్నది. సమాచార హక్కు చట్టం కింద ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి.
‘అస్సాం ప్రభుత్వం చైనా నుంచి 50 వేల పీపీఈ కిట్లను కొనుగోలు చేసింది. ఒక రాష్ట్రం సొంతంగా పీపీఈ కిట్లను కొనుగోలు చేయడం దేశంలో ఇదే మొదటిసారి’ అని 2020 ఏప్రిల్ 15న అప్పటి ఆరోగ్య మంత్రి, ప్రస్తుత సీఎం హిమంత బిశ్వ శర్మ ఘనంగా ప్రకటించుకొన్నారు. తానే స్వయంగా పీపీఈ కిట్లను అందుకొన్నట్టు పేర్కొన్నారు.
గువాహటి ఎయిర్పోర్టులో ఓ విమానం పక్కన నిలబడి ఫొటో దిగి ట్వీట్ చేశారు. పీపీఈ కిట్లను మోసుకొచ్చిన విమానం అదేనని చెప్పారు. కానీ, అది ఉత్తదేనని, హిమంత చెప్పినట్టు అస్సాం ప్రభుత్వం చైనా నుంచి పీపీఈ కిట్లు కొనుగోలు చేయలేదని తాజాగా సమాచార చట్టం కింద వెల్లడైంది. అంటే కరోనా ఉత్పాతాన్ని హిమంత తన వ్యక్తిగత ఇమేజ్ను పెంచుకోవడానికి వాడుకొన్నారన్నమాట.