Rahul on Punjab CM Candidate | పంజాబ్ సీఎం చరణ్జిత్సింగ్ చన్నీ, పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య విభేదాలకు తెర దించేందుకు కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగింది. పంజాబ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పంజాబ్ ప్రజలు కోరుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ తెలిపారు. పీసీసీ చీఫ్ సిద్దూ, సీఎం చన్నీ మధ్య వివాదం పెరుగుతున్న నేపథ్యంలో జలంధర్లో గురువారం జరిగిన సభలో రాహుల్గాంధీ మాట్లాడుతూ.. ఒక పార్టీకి ఇద్దరు నాయకులు సారధ్యం వహించలేరు. ఒక్కరే నాయకత్వం వహిస్తారు అని చెప్పారు.
సీఎం అభ్యర్థి ఎవరో తేల్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కోరుతున్నట్లు రాహుల్ గాంధీ అన్నారు. రోజంతా జలంధర్ పరిధిలో ఆయన పర్యటించారు. ఎక్కడైనా ఇద్దరు నాయకులు సారధ్యం వహించలేరు. ఒక్కరు మాత్రమే సారధ్యం వహిస్తారు. మిగతా వారు అన్ని రకాల మద్దతు తెలుపుతారు. ఇద్దరి హృదయాల్లో కాంగ్రెస్ సిద్ధాంతాలు పదిలంగా ఉంటాయి అని చెప్పారు.
సీఎం పదవి కోసం పోటీ పడుతున్న పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవ్జ్యోత్సింగ్ సిద్దూ, సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీలతో రాహుల్గాంధీ మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత సీఎం పోస్ట్ కోసం ఆశ పడటం లేదని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో పార్టీ గెలుపొందితే రాహుల్గాంధీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆయనకు సిద్దూ హామీ ఇచ్చారు. క్రమశిక్షణ గల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పార్టీ నేత రాహుల్గాంధీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా అని ప్రకటించారు. అయితే తనకు మరింత అధికారాలు కావాలని, కేవలం నామమాత్రపు నేతగా ఉండబోనని సంకేతాలిచ్చారు సిద్దూ. మేమంతా ఐక్యంగానే ఉన్నాం. టీఆర్పీల కోసం మేం కొట్లాడటం లేదు. తదుపరి ప్రభుత్వ ఏర్పాటు కోసం పోరాడుతున్నాం అని సిద్దూ చెప్పారు.
ఇదే కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ సైతం తాము ఐక్యంగానే ఉన్నామని చెప్పారు. సిద్దూ తనకు సన్నిహితుడని తెలిపారు. ఎన్నికల తర్వాత నేను ఏ పదవి కోసం పోటీ పడను. సీఎం అభ్యర్థికి అభ్యర్థిని మీరే ఖరారు చేయొచ్చు. ఆయన కోసం ప్రచారం చేయడానికి నేను ముందు వరుసలోనే ఉంటా అని చెప్పారు.