న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ పొదుపు చర్యలను ప్రారంభించింది. ఖర్చులు తగ్గించుకోవాలని, ప్రతి ఏటా రూ.50,000 విరాళంగా ఖజానాలకు ఇవ్వాలని ఎంపీలను కోరింది. అలాగే పార్టీ మద్దతుదారుల నుంచి ప్రతి ఏటా రూ.4,000 సేకరించాలని చెప్పింది. పార్టీ నిధులపై ఆధారపడకుండా లభించే ప్రయాణ, ఇతర రాయితీలను వినియోగించుకోవాలని సూచించింది. కాంగ్రెస్ పార్టీకి ఎలక్ట్రోలర్ బాండ్ల రూపంలో వచ్చే నిధులు గత పదేండ్లుగా గణనీయంగా తగ్గాయి. ఈ నేపథ్యంలో ఖర్చుల తగ్గింపు, పొదువు చర్యలతోపాటు విరాళాల సేకరణ మార్గదర్శకాలను శుక్రవారం ప్రకటించింది.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శుల నుంచి పార్టీ నేతలంతా దీనిని పాటించాలని పేర్కొంది. వీలైనంతగా రైళ్లలో ప్రయాణించాలని, తక్కువ టిక్కెట్ల ధరకు విమాన ప్రయాణాలను ఎంచుకోవాలని సూచించింది. పార్లమెంట్ సభ్యులు తమ ప్రయాణ రాయితీలను వినియోగించుకోవాలని పేర్కొంది. కార్యదర్శి అలవెన్సు రూ.12,000, ప్రధాన కార్యదర్శి అలవెన్సు రూ.15,000లో కూడా కోత విధించనున్నట్లు తెలిపింది. క్యాంటీన్, స్టేషనరీ, విద్యుత్, వార్తాపత్రికలు, ఇంధనం మొదలైన ఖర్చులను AICC ఆఫీస్ బేరర్లు స్వయంగా తగ్గించుకోవాలని వెల్లడించింది.
కాగా, ఖర్చులను కనిష్ఠంగా ఉంచాలన్న ఆలోచనే ఈ పొదుపు చర్యలకు కారణమని కాంగ్రెస్ కోశాధికారి పవన్ బన్సల్ తెలిపారు. తాను ప్రతి రూపాయిని ఆదా చేయడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పారు.