Charanjit Singh Channi: పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం రంజుగా మారింది. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నా కొద్ది వాతావరణం హీటెక్కింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీతోపాటు బీజేపీ, పంజాబ్ లోక్ కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇటీవల వెల్లడైన ఒపీనియన్ పోల్స్ సర్వే నివేదికల ప్రకారం.. పంజాబ్లో కాంగ్రెస్, ఆప్ల మధ్యనే ప్రధాన పోటీ నెలకొని ఉన్నది.
ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే మొత్తం 117 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా ఇతర పార్టీలు ఇంకా ఆ విషయంలో కసరత్తు చేస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎనిమిది మంది అభ్యర్థుల పేర్లతో మూడో జాబితాను విడుదల చేసింది. అందులో ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీ పేరు కూడా ఉన్నది. చన్నీకి ఇప్పటికే చామ్కౌర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి బెర్త్ కన్ఫర్మ్ అయ్యింది.
తాజాగా విడుదల చేసిన మూడో లిస్టులో మరో స్థానాన్ని చన్నీకి కేటాయించారు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన భదౌర్ నియోజకవర్గం నుంచి కూడా చన్నీ బరిలో దిగనున్నారు. కాగా, పంజాబ్లో ఈ నెల 20న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. మార్చి 10న ఫలితాలు వెల్లడి కానున్నాయి.