న్యూఢిల్లీ: ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కాంగ్రెస్ అధ్యక్ష పదవికి త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. అక్టోబర్ 17న ఎన్నికలు, 19న కౌంటింగ్ జరుగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం ఆదివారం వర్చువల్గా జరిగింది. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ కీలక నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతోపాటు జీ-23 అసమ్మతి గ్రూపులో భాగమైన ఆనంద్ శర్మ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పార్టీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ, కేసీ వేణుగోపాల్, కేంద్ర మాజీ మంత్రులు జైరాం రమేష్, ముకుల్ వాస్నిక్, పీ చిదంబరం, రాజస్థాన్ సీం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘెల్ పాల్గొన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్తోపాటు పలు అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు.
కాగా, ఆగస్ట్ 21-సెప్టెంబర్ 20 మధ్యలో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలని గత ఏడాది జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయించారు. అయితే ఈ షెడ్యూల్కు కొంత ఆలస్యంగా అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయని పార్టీ వర్గాలు తెలిపాయి. అక్టోబర్ 17న ఎన్నికలు, 19న కౌంటింగ్ జరుగవచ్చని పేర్కొన్నాయి.
మరోవైపు సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్, యువ నేత జైవీర్ షెర్గిల్ తాజాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలను ఖరారు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నది. కాగా, పార్టీ యంత్రాంగం మొత్తాన్ని నాశనం చేశారంటూ రాహుల్ గాంధీపై ఆజాద్ మండిపడ్డారు. సోనియా గాంధీకి పంపిన తన రాజీనామా లేఖలో ఈ మేరకు ఆయన ఆరోపించారు.