పాట్నా: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra) నేడు బీహార్లోకి (Bihar) ప్రవేశించనుంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన మరుసటి రోజే ఆయన బీహార్కు రానుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఆర్జేడీ, కాంగ్రెస్, జేడీఎస్ ఆధ్వర్యంలోని మహఘట్బంధన్ కూటమి నుంచి సీఎం నితీశ్ కుమార్ ఆదివారం వెలుపలికి వచ్చిన విషయం తెలిసిందే. బీజేపీతో మరోసారి చేతులుకలిపిన ఆయన కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
2020 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన రాహుల్.. ఆ తర్వాత రాష్ట్రానికి రావడం ఇదే మొదటిసారి. సోమవారం మధ్యాహ్నం కిషాన్గంజ్ మీదుగా జోడో యాత్ర బీహార్లోకి ప్రవేశిస్తుంది. ముస్లిం జనాభా అధికంగా ఉన్న ఆ జిల్లా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నది. భారీ ర్యాలీ అనంతరం ఈ రోజు సాయంత్రం నిర్వహించనున్న బహిరంగ సభలో రాహుల్ మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలపై ఆయన ఏవిధంగా స్పందిస్తారనే విషయమై చర్చ నడుస్తున్నది.