TVK-Congress : తమిళనాడులో విజయ్ ఆధ్వర్యంలోని టీవీకే కూటమి అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కూటమిలో కాంగ్రెస్ ప్రధాన భాగస్వామిగా ఉంది. అయితే, ఇప్పుడు ఈ కూటమిలో విబేధాలు చోటు చేసుకున్నాయి. ప్రధాని అభ్యర్థి విషయంలో కాంగ్రెస్, టీవీకే పార్టీల మధ్య వివాదం నడుస్తోంది. 2029లో ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీకి విజయ్ మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.
లేదంటే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి ఎస్.రాజేశ్ కుమార్ హెచ్చరించారు. తనతోపాటు పి.విశ్వనాథన్ కూడా మంత్రి పదవికి రాజీనామా చేస్తారని ఆయన అన్నారు. దీనికి కారణం ఉంది. 2029లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయ్ ప్రధాని అభ్యర్థిగా ఉంటారంటూ టీవీకే నేతలు తమిళనాడులో ప్రచారం చేస్తున్నారు. విజయ్ను ప్రధాని అభ్యర్థిగా ఆ పార్టీ నేతలు బలపరుస్తున్నారు. పైగా ఇటీవల ఒక జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో విజయ్న ప్రధాని అభ్యర్థిగా 9 శాతం మంది అంగీకరిస్తున్నట్లు వెల్లడైంది.
దీంతో విజయ్కు మద్దతు పెరిగింది. ఇదే కాంగ్రెస్ పార్టీకి ఆగ్రహం తెప్పిస్తోంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అగ్రనేత అయిన రాహుల్ గాంధీకి ఉన్న ఇమేజ్ దృష్ట్యా 2029 ఎన్నికల్లో ఆయనే ప్రధాని అభ్యర్థి అని కాంగ్రెస్ ఎప్పటినుంచో ప్రచారం చేస్తోంది. దేశానికి కాబోయే ప్రధాని రాహులే అంటూ ఎప్పటినుంచో చెబుతోంది. అలాంటిది, తమిళనాడులో టీవీకే విజయ్ను ప్రధాని అభ్యర్థిగా చూపెడుతుండటంపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తమ వల్లే తమిళనాడులో విజయ్ సీఎం అయ్యారని, ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలిగారని కాంగ్రెస్ అంటోంది. రాహుల్కు మద్దతు ఇవ్వకపోతే కూటమిలో కొనసాగబోమని, మంత్రి పదవులకు రాజీనామా చేస్తామని ఆ పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు.