బెంగళూర్ : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly Elections) కాంగ్రెస్ భారీ ఆధిక్యంతో గెలుపొందుతుందని, హుబ్లీ-ధార్వాడ్ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తాను ఘన విజయం సాధిస్తానని మాజీ సీఎం, కాంగ్రెస్ నేత జగదీష్ శెట్టార్ ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో బుధవారం మధుర కాలనీలో ఎస్బీఐ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
బీజేపీ టికెట్ నిరాకరించడంతో చివరి నిమిషంలో కాంగ్రెస్లో చేరిన జగదీష్ శెట్టార్ ఆ పార్టీ నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. కర్నాటకలో అన్ని కులాలు, వర్గాల వారు కాంగ్రెస్ వెంట నిలిచారని, ప్రజల్లో బీజేపీ పట్ల తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని శెట్టార్ పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారం నుంచి వైదొలగడం ఖాయమని స్పష్టం చేశారు.
ప్రముఖ లింగాయత్ నేత జగదీష్ శెట్టార్, అదే సామాజిక వర్గానికి చెందిన మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవది కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కాషాయ పార్టీలో కలకలం రేగింది. మరోవైపు వీరశైవ లింగాయత్ గ్రూపు కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని పిలుపు ఇవ్వడం బీజేపీకి గట్టి ఎదురుదెబ్బగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఈనెల 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.
Read More
MLC Kavitha | అభివృద్ధికి ఓటేయండి.. కర్ణాటక ఓటర్లకు ఎమ్మెల్సీ కవిత పిలుపు