Rahul Gandhi : ఇవాళ మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల ప్రచార సభలకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ హాజరుకావడంలేదని ఆ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్ తెలిపారు. ఇవాళ రాహుల్గాంధీ ఆరోగ్యం సరిగా లేదని, అందుకే మధ్యప్రదేశ్, జార్ఖండ్ సభల్లో పాల్గొనడం లేదని ఆయన వెల్లడించారు.
షెడ్యూల్ ప్రకారం రాహుల్గాంధీ ఇవాళ మధ్యప్రదేశ్లోని సాత్నా, జార్ఖండ్లోని రాంచిలో జరిగే ఇండియా కూటమి ఎన్నికల ప్రచార సభలకు హాజరుకావాల్సి ఉంది. అయితే ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆయన ఆ రెండు సభలకు రావడంలేదు. రాహుల్గాంధీకి బదులుగా కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సాత్నా, రాంచి సభల్లో ప్రసంగించనున్నారు.
ప్రచార సభల నేపథ్యంలో సాత్నా, రాంచిల్లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీతోపాటు ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్, ఆయన సతీమణి కల్పనా సోరెన్ ఫ్లెక్సీలు వెలిశాయి.
కాగా, ఈ ఎన్నికల ప్రచారసభల్లో మల్లికార్జున్ ఖర్గే, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, అర్వింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ ప్రసంగించనున్నారు. కల్పనా సోరెన్ జార్ఖండ్ ప్రచార సభలో ప్రసంగించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.