పనాజీ: గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆ పార్టీ తమిళనాడు రాజధాని చెన్నైకి తరలించింది. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత రాత్రి వేళ ఐదుగురు పార్టీ ఎమ్మెల్యేలను చైన్నైకి పంపింది. ప్రస్తుతం వారు అక్కడి హోటల్లో బస చేస్తున్నారు. గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంకల్ప్ అమోంకర్, ఆల్టన్ డికోస్టా, కార్లోస్ అల్వారెస్, రుడాల్ఫ్ ఫెర్నాండెజ్, యూరి అలెమో ప్రస్తుతం చెన్నైలో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీ గాలం నుంచి కాపాడుకునేందుకు ఈ చర్య చేపట్టినట్లు తెలుస్తున్నది.
కాగా, గోవాలో అధికారంలో ఉన్న బీజేపీ, ఆ రాష్ట్రంలోని ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీలో చిచ్చుపెట్టింది. ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి బీజేపీలో చేరేలా ప్రేరేపిస్తున్నది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు ముందు జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశానికి మొత్తం 11 మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురు గైర్హాజరయ్యారు. వారంతా రెండు రోజులు పార్టీ నాయకత్వానికి అందుబాటులో లేకుండా పోయారు. దీంతో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతున్నట్లుగా వదంతులు వచ్చాయి.
అయితే సోమవారం ప్రారంభమైన గోవా అసెంబ్లీ సమావేశాలకు ఆ ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విడిగా వచ్చారు. ఈ నేపథ్యంలో పార్టీలో కుట్రకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో గోవా అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అయిన మైఖేల్ లోబోను ఆ పదవి నుంచి కాంగ్రెస్ తప్పించింది. అలాగే ఆయనతోపాటు దిగంబర్ కామత్పై అనర్హత వేటు కోసం స్పీకర్కు నోటీసు ఇచ్చింది.
మరోవైపు ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడకుండా కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త పడుతున్నది. బీజేపీ ట్రాప్లో పడకుండా ఉండేందుకు ఐదుగురు ఎమ్మెల్యేలను శుక్రవారం రాత్రి చెన్నైకి తరలించింది. సోమవారం ఉదయం నేరుగా చెన్నై నుంచి అసెంబ్లీకి వారిని తరలించనున్నది.