అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ గురువారం జరుగుతున్నది. తొలి విడతలో 89 నియోజకవర్గాల నుంచి 788 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. కాగా, పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. జామ్నగర్, రాజ్కోట్ వంటి చోట్ల కొన్ని ఈవీఎంలు పని చేయలేదు. వాటిని మార్చేందుకు అధికారులకు గంటకు పైగా సమయం పట్టింది. కాంగ్రెస్ గుజరాత్ ఇన్ఛార్జ్ అలోక్ శర్మ దీనిపై మండిపడ్డారు. సూమారు 50 ఈవీఎంలు మొరాయించాయని, వాటిని మార్చేందుకు చాలా సమయం పట్టిందని విమర్శించారు. అలాగే పోలింగ్ కవరేజీపై కొన్ని టీవీ చానెల్స్ గుజరాత్లోని అధికార బీజేపీకి అనుకూలంగా, ప్రతిపక్షాల పట్ల పక్షపాత ధోరణి వహిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఇది ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడమేనని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ (ఈసీ) వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో ఈవీఎంల మొరాయింపు, కొన్ని మీడియా సంస్థల పక్షపాత కవరేజీపై ఈసీకి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. కాగా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్లో ఉదయం 11 గంటల వరకు 18.5 శాతం, మధ్యాహ్నం 1 గంట వరకు 34.5 శాతం ఓటింగ్ నమోదైంది. కచ్, సౌరాష్ట్ర ప్రాంతంలోని 19 జిల్లాలు, రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతం కలిపి 89 స్థానాలకు గురువారం తొలి దశ పోలింగ్ నిర్వహించారు.