చెన్నై: తమిళనాడులోని మధురైలో 95 శాతం నిర్మించిన ‘ఎయిమ్స్ బిల్డింగ్ చోరీ’ అయ్యిందని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ ఆరోపించారు. ఆ నిర్మాణ ప్రాంతానికి వెళ్లి పరిశీలించామని, అయితే బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్న 95 శాతం పూర్తయిన మధురై ఎయిమ్స్ బిల్డింగ్ తమకు ఎక్కడా కనిపించలేదని ఎద్దేవా చేశారు.
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తమిళనాడులోని మధురైలో గురువారం పర్యటించారు. ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మధురై ఎయిమ్స్ ప్రాజెక్ట్ కోసం రూ.1,264 కోట్లు కేటాయించినట్లు ప్రకటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. 750 పడకల ఆసుపత్రి పనులు 95 శాతం పూర్తయ్యాయని అన్నారు. స్పెషల్ బ్లాక్ కోసం అదనంగా రూ.164 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.
కాగా, కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్, మధురై ఎంపీ సు వెంకటేశన్ కలిసి ఎయిమ్స్ హాస్పిటల్ నిర్మాణ స్థలాన్నిశుక్రవారం పరిశీలించారు. అయితే తమకు ఎక్కడా 95 శాతం పూర్తయిన ఎయిమ్స్ భవనం కనిపించలేదని తెలిపారు. బహుశా అది చోరీ అయ్యి ఉంటుందని ఎద్దేవా చేశారు. మాజీ వైద్య మంత్రి అయిన నడ్డా, ఎయిమ్స్ ఆసుపత్రి 95 శాతం పూర్తయినట్లుగా అబద్ధాలు చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉందని విమర్శించారు. మీడియాతో కలిసి ఆ స్థలాన్ని సందర్శించిన ఆయన ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
మరోవైపు తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి దీనిపై స్పందించారు. మధురై ఎయిమ్స్ నిర్మాణం మొదలుపెట్టే ప్రక్రియ 95 శాతం పూర్తయిందని నడ్డా చెప్పారన్నారు. నిర్మాణ పనులు త్వరలో మొదలవుతాయని ఆయన అన్నట్లుగా ట్విట్టర్లో పేర్కొన్నారు.
We went to the Thoppur AIIMS Madurai site … we found nothing . #MaduraiAIIMS pic.twitter.com/9CBxHEs6Mt
— Manickam Tagore .B🇮🇳✋மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) September 23, 2022