Dress Code | వారణాసి: వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో భక్తుల రద్దీని నియంత్రించడానికి పోలీస్ శాఖ తీసుకున్న నిర్ణయం విమర్శలకు దారి తీసింది. గుడి లోపల పోలీసులను పూజారుల దుస్తుల్లో ఎందుకు నియమించారని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ యూపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘ఏ ‘పోలీస్ నిబంధనావళి’ ప్రకారం పోలీసులకు ఇలా పూజారుల వేషం వేయించడం సమంజసం? రేపు ఎవరైనా దొంగ దీన్ని అవకాశంగా తీసుకొని అమాయక ప్రజలను దోచుకొంటే అందుకు యూపీ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది?’ అని ఆయన శుక్రవారం ఎక్స్లో పోస్ట్ చేశారు.
దీనిపై వారణాసి పోలీస్ కమిషనర్ మోహిత్ స్పందించారు. కేవలం గుడి లోపల రద్దీని నియంత్రించడానికి, దైవ దర్శనంలో వారికి సానుకూల అనుభూతిని కలిగించడానికి ఇలా చేశామన్నారు. ‘పోలీసులు తరచూ తమను తోసేస్తుంటారని భక్తులు ఫిర్యాదు చేస్తుంటారు. అదే పూజారుల సూచనలను శ్రద్ధగా పాటిస్తారు’ అని తమ నిర్ణయం వెనుక కారణాన్ని ఆయన వెల్లడించారు.