TN CM Vijay : తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu CM) సీ జోసెఫ్ విజయ్ (Joseph Vijay) ప్రతిపక్ష డీఎంకే (DMK) పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇవాళ అసెంబ్లీ (Assembly) లో పోలీసు శాఖ పద్దులపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ.. డీఎంకే పాలనలో జరిగిన అవినీతిని, అక్రమాలను ఆధారాలతో సహా బయటపెట్టారు. డీఎంకే అధ్యక్షుడు (DMK chief) ఎంకే స్టాలిన్ (MK Stalin), ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) సహా పలువురు సీనియర్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు.
ఈ సందర్భంగా సీఎం విజయ్ మాట్లాడుతూ.. రాజకీయ విమర్శలు సహజమేనని, కానీ మహిళలపై అనుచితమైన, కించపరిచే వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అసెంబ్లీ సాక్షిగా స్పష్టంచేశారు. డీఎంకేకు ఓటు వేయని ప్రజలను ఆ పార్టీ నేతలు విమర్శించడంపై ఆయన మండిపడ్డారు. ప్రజల తీర్పును గౌరవించకపోవడంవల్లే డీఎంకే నేడు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చిందని విజయ్ విమర్శించారు.
అవినీతి ఆరోపణల గురించి ప్రస్తావిస్తూ.. డీఎంకే బండారం మొత్తం అధికారిక రికార్డుల్లో, అసెంబ్లీ లైబ్రరీలో అందుబాటులో ఉందని విజయ్ అన్నారు. 1977 నాటి సర్కారియా కమిషన్ నివేదికను ఆయన ఉటంకించారు. వీరాణం పైప్లైన్ ప్రాజెక్ట్లో కాంట్రాక్టులు ఇచ్చేందుకు కమీషన్లు డిమాండ్ చేశారని, ఒక నిర్దిష్ట కంపెనీకి అనుకూలంగా వ్యవహరించేందుకు అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఈ ఆరోపణలకు సంబంధించిన పత్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు.
అంతేగాక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపణలను కూడా విజయ్ సభ దృష్టికి తీసుకొచ్చారు. పార్టీ ఫండ్ల పేరుతో పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేశారని, కొన్ని లావాదేవీలలో 7.5 నుంచి 10 శాతం వరకు కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి వి సెంథిల్ బాలాజీ తన అధికారిక హోదాను దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు. ఈ అక్రమ లావాదేవీలలో మాజీ మంత్రికి సంబంధించిన అధికారులు, వ్యక్తులు భాగస్వాములుగా ఉన్నారని విజయ్ తెలిపారు.
ఈడీ ఆరోపణలకు సంబంధించి ఎంకే స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ పేర్లను కూడా ఆయన ప్రస్తావించారు. అయితే ఇవి కేవలం ఏజెన్సీ చేసిన ఆరోపణలు మాత్రమేనని, కోర్టులో ఇంకా రుజువు కాలేదని గమనించాలని అన్నారు. డీఎంకే అవినీతికి సంబంధించిన రికార్డులు చాలా ఉన్నాయని, అవన్నీ చదవాలంటే దాదాపు రెండు రోజులు పడుతుందని, అందుకే సభలో కేవలం సారాంశాన్ని మాత్రమే ప్రస్తావిస్తున్నానని విజయ్ చెప్పారు.
ఇప్పటికే బహిరంగ రికార్డుల్లో ఉన్న ఆధారాల కోసం డిమాండ్ చేయడం మాని, తమపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని డీఎంకేకు సవాల్ విసిరారు. తాను పదవి కోసమో, అధికారం కోసమో రాజకీయాల్లోకి రాలేదని, ప్రజలకు సేవ చేయడానికే వచ్చానని స్పష్టంచేశారు. సీఎన్ అన్నాదురై, ఎంజీ రామచంద్రన్, ఎన్టీ రామారావు వంటి మహనీయుల వారసత్వాన్ని గుర్తుచేస్తూ, రాజకీయ ప్రత్యర్థులపై ప్రజల అభిమానమే అంతిమంగా గెలుస్తుందని విజయ్ విశ్వాసం వ్యక్తంచేశారు.