హైదరాబాద్, జూలై 14(నమస్తే తెలంగాణ): మెగా విజయ డెయిరీ నిర్మాణానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఓఆర్ఆర్ పరిధిలో పరిశ్రమల ఏర్పాటును నియంత్రిస్తూ ఇచ్చిన జీవో నంబర్ 20 నుంచి విజయ డెయిరీకి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. దీంతో మెగా డెయిరీ నిర్మాణానికి మార్గం సుగమమయింది. డెయిరీ నిర్మాణానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చిన సీఎం కేసీఆర్ను విజయ డెయిరీ చైర్మన్ లోకా భూమారెడ్డి బుధవారం ప్రగతిభవన్లో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు సహకరించిన మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్కు ధన్యవాదాలు తెలిపారు. విజయ డెయిరీ ఆధ్వర్యంలో పాల సేకరణ, ఉత్పత్తిని పెంచేందుకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కాంచ ఇమారత్ గ్రామంలో 40 ఎకరాల విస్తీర్ణంలో రూ.245 కోట్లతో విజయ మెగా డెయిరీని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే టెండర్లను పిలువనున్నట్టు భూమారెడ్డి తెలిపారు. రెండేండ్లలో ప్రాజెక్టు పూర్తికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.