బెంగళూరు: కర్ణాటకలో ఇద్దరు సీనియర్ మహిళా ఉన్నతాధికారిణులు సోషల్ మీడియా వేదికగా గొడవకు దిగారు. హస్తకళల అభివృద్ధి సంస్థ ఎండీ, ఐపీఎస్ అధికారిణి డీ రూప, దేవాదాయ శాఖ కమిషనర్, ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి ఒకరినొకరు దూషించుకున్నారు. రోహిణి సింధూరి పలు అక్రమాలకు పాల్పడినట్టు రూప ఆరోపణలు చేయడంతో పాటు ఆమె వ్యక్తిగత ఫొటోలను ఆదివారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇవే ఫొటోలను రోహిణి కొందరు పురుష ఐఏఎస్ అధికారులకు షేర్ చేసి వృత్తి నియమాలను ఉల్లంఘించారని ఆరోపించారు.
అవి వాట్సాప్ స్టేటస్ స్క్రీన్షాట్లు
ఐపీఎస్ రూప చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, వాట్సాప్ స్టేటస్ స్క్రీన్షాట్లను సేకరించి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రోహిణి సింధూరి పేర్కొన్నారు. తాను ఈ ఫొటోలు పంపానని చెప్తున్న ఆ కొందరు ఎవరో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. రూప మతి భ్రమించినట్టు ప్రవర్తిస్తున్నారని, వ్యక్తిగత కక్షతోనే తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఇద్దరి తీరుపై ప్రభుత్వం ఆగ్రహం
ఈ వ్యవహాంపై కర్ణాటక ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇద్దరిపై చర్యలు తప్పవని ఆ రాష్ట్ర హోం మంత్రి జ్ఞానేంద్ర హెచ్చరించారు. కాగా, రోహిణి, రూప ఇద్దరూ ఒకరిపై ఒకరు చర్యలు తీసుకోవాలని సీఎస్ వందిత శర్మకు ఫిర్యాదు చేసుకున్నారు. రూపపై చర్యలు తీసుకోవాలని రోహిణి భర్త సుధీర్ రెడ్డి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.