చెన్నై : కుంభంకోణం తందంతోట్టంలోని నదనపురీశ్వరార్ శివన్ ఆలయంలో దాదాపు 50 సంవత్సరాల కిందట అదృశ్యమైన పార్వతీ దేవి విగ్రహం న్యూయార్క్లో కనిపించిందని తమిళనాడు సీఐడీ సోమవారం తెలిపింది. న్యూయార్క్లోని బోన్హామ్స్ ఆక్షన్ హౌస్లో ఈ విగ్రహం కనిపించిందని సీఐడీ పేర్కొంది. 1971లో విగ్రహం అదృశ్యంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. 2019, ఫిబ్రవరిలో కే వాసు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు సీఐడీ ఐడల్ వింగ్ ఎఫ్ఐఆర్ నమోదు చేసినా.. కేసు పెండింగ్లో ఉన్నది. ఐడల్ వింగ్ ఇన్స్పెక్టర్ ఎం చిత్ర నేతృత్వంలో దర్యాప్తు జరుగుతున్నది. ఈ క్రమంలో విదేశాల్లో ఉన్న వివిధ మ్యూజియాలు, యాక్షన్ హౌస్ల్లో చోళులకాటి నాటి పార్వతి విగ్రహం గురించి పరిశోధించగా.. ఇటీవల ఓ విగ్రహం వారి దృష్టిని ఆకర్షించింది.
ఆ విగ్రహం గురించి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత బోన్హామ్స్ యాక్షన్ హౌస్లో ఉన్నది 50 సంవత్సరాల క్రితం అదృశ్యమైన విగ్రహంగా నిర్ధారించారు. సుమారు 12వ శతాబ్దానికి చెందిన చోళుల కాలం నాటి ఈ రాగి విగ్రహం ఎత్తు 52 సెంటీమీటర్లు ఉంటుందని, విలువ 212,575 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.1,68,26,143) అని ఐడల్ వింగ్ పేర్కొంది. ఈ సందర్భంగా ఐడల్ వింగ్ సీఐడీ డీజీపీ జయంత్ మరళీ ఆధ్వర్యంలో బృందం విగ్రహానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు అవసరమైన పత్రాలను సిద్ధం చేసింది.