కోల్కతా, మార్చి 19: పశ్చిమ బెంగాల్లో ఉత్తర 24 పరగణాల జిల్లాలోని భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఓ చైనా డ్రోన్ కలకలం సృష్టించింది. పుర్బపారా గ్రామంలోని తన పొలంలో విరిగిపోయిన ఆ డ్రోన్ పడివుండటాన్ని పంకజ్ సర్కార్ అనే రైతు శనివారం గుర్తించాడని బీఎస్ఎఫ్ అధికారులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న బోర్డర్ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకున్నారు. అయితే ఆ డ్రోన్ అక్కడ ఎలా పడిందనే దానిపై వివరాలు తెలియరాలేదు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.