న్యూఢిల్లీ: దేశానికి స్వాతంత్ర్యం 1947లో రాలేదని, 2014లో నరేంద్రమోదీ ప్రధాని అయిన తర్వాత వచ్చిందని ఇటీవల కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ ( Nitish Kumar on Kangana ) నిరాకరించారు. మీడియా ప్రతినిధులు స్వాతంత్ర్యం గురించి సంజనా చేసిన వ్యాఖ్యలను నితీశ్ కుమార్ ముందు ప్రస్తావించగా ఆయన తేలిగ్గా తీసిపారేశారు. ఆమె వ్యాఖ్యలకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని, అవి నవ్వుకుని వదిలేయాల్సిన మాటలని వ్యాఖ్యానించారు.
ఇలాంటి వ్యాఖ్యలను ఎవరైనా ఎలా ప్రచురిస్తారు..? అలా ప్రచురించడంలో అర్థం ఏముంది..? ఆ వ్యాఖ్యలను పట్టించుకోవాలా..? వాటిపై దృష్టి సారించాలా..? మన దేశానికి స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చిందనేది తెలియనిది ఎవరు..? ఇలాంటి వ్యాఖ్యలకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. అవి కేవలం నవ్వుకునే మాటలు. పబ్లిసిటీ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారు. వాటిని నేను పట్టించుకోను. ఇలాంటివి నాకు నచ్చవు కూడా అని బీహార్ సీఎం వ్యాఖ్యానించారు.