న్యూఢిల్లీ: చైనా, ఇండియా సరిహద్దుల్లో ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఉత్తరాఖండ్ బోర్డర్ వద్ద పొరుగు దేశం చైనా గ్రామాల(China Villages)ను నిర్మిస్తున్నట్లు వెల్లడైంది. ఎల్ఏసీకి 11 కిలోమీటర్ల దూరంలో 250 ఇండ్లు ఉన్న ఓ గ్రామాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఉత్తరాఖండ్కు సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో ప్రాంతంలో కూడా చైనా దాదాపు 56 ఇండ్లు నిర్మిస్తున్నట్లు కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది. సుదీర్ఘమైన సరిహద్దు వెంట సుమారు 400 గ్రామాలను నిర్మించాలని చైనా ప్లాన్ వేసింది.
అన్ని సదుపాయాలతో కూడిన గ్రామాలను నిర్మించాలని చైనా యోచిస్తోంది. అయితే నియంత్రణ రేఖ వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు భారతీయ ఆర్మీ అధికారులు వెల్లడించారు. భూటాన్లోని ఆమో చు నది లోయ వద్ద కూడా చైనా గ్రామాలను నిర్మిస్తున్నది. దాని పట్ల ఏప్రిల్లో భారతీయ మిలిటరీ ఆందోళన వ్యక్తం చేసింది.