Hero of The Sea: హైదరాబాద్ వాసి అయిన చిల్కూరి సుశీల్ రావు (Chilkuri Sushil Rao) నిర్మించి, దర్శకత్వం వహించిన ‘హీరో ఆఫ్ ద సీ (Hero Of The Sea)’ డాక్యుమెంటరీకి అరుదైన అవార్డు దక్కింది. మార్చి 10న హైదరాబాద్లో జరిగిన 8వ ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ (8th Indian World Film Festival) లో ‘Honourable Jury Mention’ అవార్డును ఈ డాక్యుమెంటరీ గెలుచుకుంది.
ఇటీవల మన నౌకలపై దాడికి ప్రయత్నించిన పైరేట్స్ మీద భారత నావికా దళం తీసుకున్న దృఢమైన చర్యను ఈ డాక్యుమెంటరీలో చూపించారు. అంతేగాక 2019 లో నైజీరియాలో సముద్రపు దొంగల చేతిలో బంధీలుగా మారిన ఐదుగురు భారతీయులు ఎలాంటి కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందో కూడా ఈ డాక్యుమెంటరీలో తెరకెక్కించారు. నాడు బంధీలుగా మారిన ఐదుగురు భారతీయులు అధికారుల జోక్యంతో 70 రోజుల తర్వాత బయటపడ్డారు.
కాగా, నోయిడాకు చెందిన ముంబై బాక్సాఫీస్ నిర్వహించిన ఈ ఫిల్మ్ ఫెస్టివల్కు 200 కంటే ఎక్కువ ఎంట్రీలు వచ్చాయి. వీరిలో 83 మందిని అధికారికంగా ఎంపిక చేశారు. వీటిలో ఫీచర్ ఫిల్మ్లు, ఫీచర్ డాక్యుమెంటరీలు, షార్ట్ డాక్యుమెంటరీలు, యానిమేషన్ డాక్యుమెంటరీలు, మ్యూజిక్ వీడియోలతో సహా వివిధ విభాగాల్లో అంతర్జాతీయ జ్యూరీ విజేతలను ఎంపిక చేశారు.
‘ది హీరో ఆఫ్ ది సీ’ జ్యూరీ చేత ‘Honourable Jury Mention’ అవార్డుకు ఎంపికైంది. ప్రధాన సలహాదారు డీసీ సింగ్, మినీ బాక్సాఫీస్ వ్యవస్థాపకుడు రాంభుల్ సింగ్ అన్ని విభాగాల్లో విజేతలకు జ్ఞాపికలు, సర్టిఫికెట్లను అందజేశారు. హైదరాబాద్లో ఈ వేడుకలు నిర్వహించడం ఇది ఎనిమిదోసారి. గత జనవరిలో జరిగిన 11వ నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్-24లో ఎంపికైన ‘హ్యూమన్ ఫీలింగ్స్ ఇన్ రోబోట్ వార్స్’ అనే చిన్న డాక్యుమెంటరీ ఎంట్రీకి సుశీల్ రావుకు ‘సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్’ అందించారు.